తాత్కాలికంగా నిలిపివేస్తూ డీఎంఈ రమేశ్రెడ్డి ఉత్తర్వులు
పద్మారావునగర్, వెలుగు: రాష్ర్టంలో ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్లో కరోనా రోగులకు అందించే స్పెషల్ కొవిడ్ డైట్ను తాత్కాలికంగా నిలిపివేస్తూ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్(డీఎంఈ) రమేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా బాధితుల్లో ఇమ్యూనిటీని పెంచేందుకు డ్రైఫ్రూట్స్, మాంసాహారం, పాలు, గుడ్లు, పండ్లు, మినరల్ వాటర్ వంటి పోషకాహారం గల స్పెషల్ ఫుడ్ అందించేవారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో జీవో నంబర్ 298 ప్రకారం 2020 జులై 15 నుంచి కరోనా స్పెషల్ డైట్ ప్రారంభించారు. బలవర్థకమైన ఆహారం కోసం కొవిడ్ రోగులకు రోజుకు రూ.275, ఫ్రంట్ లైన్ వారియర్స్అయిన డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, టెక్నికల్ సిబ్బందికి రూ.300 కేటాయించారు.
చికిత్స పొందుతున్న బాధితులతోపాటు కరోనా రోగులకు సేవలు అందించే డాక్టర్లు, నర్సింగ్ సిబ్బందికి ఆయా ఆస్పత్రుల డైట్ కాంట్రాక్టర్ ద్వారా ఫుడ్ అందజేశారు. సాధారణ రోగులకు అందించే డైట్ రోజుకు రూ.40తో పోలిస్తే కరోనా రోగులకు 7 రెట్లు ఎక్కువ మొత్తం కేటాయించారు. రాష్ట్రంలోని పలు టీచింగ్ హాస్పిటళ్లలో ఇప్పటికీ ప్రత్యేక వార్డుల్లో కరోనా బాధితులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కరోనా నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం 35 కరోనా కేసులు,16 బ్లాక్ ఫంగస్ మొత్తం 51 మందికి ట్రీట్మెంట్అందిస్తున్నారు.
కాగా, ఈ నెల 25 నుంచి కరోనా డైట్ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు డీఎంఈ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సాధారణ రోగులకు అందించే ఫుడ్నే కరోనా రోగులకు అందిస్తున్నారు. భవిష్యత్లో ఒమిక్రాన్ లాంటి వేరియంట్లతో కరోనా బాధితులు పెరిగితే తిరిగి స్పెషల్ కొవిడ్ ఫుడ్ అందజేస్తామని పేర్కొన్నారు.