
- కలెక్టర్ విజయేందిర బోయి ఆధ్వర్యంలో నిర్వహణ
- ప్రతి నెల మొదటి బుధవారం వినతుల స్వీకరణ
మహబూబ్నగర్, వెలుగు:వయో వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు స్వయంగా తెలుసుకునేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ విజయేందిర బోయి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెలా మొదటి బుధవారం క్రమం తప్పకుండా వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ మేరకు గత బుధవారం నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొదటి సారి నిర్వహించిన కార్యక్రమంలో 30 అప్లికేషన్లు రాగా.. అందులో దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల నుంచి పింఛన్లు మంజూరు చేయించాలని ఎక్కువ అప్లికేషన్లు ఇచ్చారు. ఈ అప్లికేషన్లను సంబంధింత శాఖల ఆఫీసర్లకు రెఫర్ చేయగా.. త్వరలో వీరికి పింఛన్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఇబ్బందులను గుర్తించి..
మహబూబ్నగర్ కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి అన్నివర్గాల ప్రజలు తమ సమస్యలను కలెక్టర్కు వివరించేందుకు వస్తుండగా.. ప్రతి వారం కనీసం 60 నుంచి 100 మంది వరకు వివిధ సమస్యలపై అర్జీలు అందజేస్తున్నారు. వీరిలో దివ్యాంగులు, వయోవృద్ధులు కూడా ఉంటున్నారు. సాధారణ ప్రజలతో పాటు వీరు క్యూ లైన్లో గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. సమస్యను వెంటనే కలెక్టర్కు దృష్టికి తీసుకురావాలనే తపనతో ముందుగానే కలెక్టరేట్కు చేరుకుంటున్నా.. అప్పటికే ఉన్న క్యూ లైన్ చూసి చాలా మంది గంటల తరబడి వేచి ఉండలేక సమస్య చెప్పుకోకుండానే వెనుదిరుగుతున్నారు.
మరో వైపు జిల్లా కేంద్రం శివారులో కలెక్టరేట్ ఉండడంతో అంత దూరం రాలేక మరికొందరు తమ సమస్యలను కూడా చెప్పుకోవడం లేదు. అయితే కొందరు మాత్రం ఉదయం 8 గంటలకే ప్రజావాణికి వచ్చి కలెక్టర్ను కలిసి సమస్యను వివరించేంత వరకు తిరిగి వెళ్లడం లేదు. ఈ క్రమంలో ఒంటరిగా వస్తున్న కొందరు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు ఆకలి, దప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న కలెక్టర్.. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించారు.
ప్రతి నెలా మొదటి బుధవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించేలా ప్లాన్ చేశారు. దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లకు వీలుగా ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న అర్బన్ తహసీల్దార్ ఆఫీస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. జిల్లాలోని అన్ని మండలాలకు చెందిన సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు తమ సమస్యలపై ఈ ప్రజావాణిలో వినతులు అందజేయవచ్చు. వినతులను కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్, ఆర్డీవో ఇతర ఉన్నతాధికారులు స్వీకరిస్తారు. అప్లికేషన్లను పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
గతంలో మండల స్థాయికమిటీలు
సీనియర్ సిటిజన్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఏడాది కింద మండల స్థాయి కమిటీలను వేశారు. కమిటీలో తహసీల్దార్, ఎంపీడీవో, ఏపీఎం, బ్యాంక్ మేనేజర్, ఎస్సై, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఉంటారు. వయోవృద్ధులను వారి పిల్లలు హింసించినా, పోషించకపోయినా, ఇబ్బందులు పెట్టినా.. బాధితులు ఈ కమిటీని ఆశ్రయిస్తే.. స్పందించి వారికి కౌన్సెలింగ్ ఇస్తారు. అలాగే వయోవృద్ధులు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కమిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. ఒక వేళ ఈ కమిటీ ఆ సమస్యకు పరిష్కారం చూపకపోతే ఆర్డీవో ఆధ్వర్యంలో ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు. అక్కడా పరిష్కారం లభించకపోతే.. కలెక్టర్ ఆధ్వర్యంలో అఫిలెటివ్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి సమస్యను పరిష్కరించుకోవచ్చు.
ఐదు డిపార్ట్మెంట్లే కీలకం..
వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజావాణిలో ప్రధానంగా పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర ప్రభుత్వ పథకాలను వర్తింపజేయాలనే వినతులు వస్తున్నాయి. అయితే కలెక్టర్ ఈ రెండు వర్గాలకు కీలకంగా ఉన్న డీఆర్డీవో, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీస్, రెవెన్యూ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లను ప్రత్యేక ప్రజావాణిలో భాగస్వామ్యులను చేశారు. వీరు వచ్చిన అప్లికేషన్లను పరిశీలించి బాధితులకు సత్వర న్యాయం అందించనున్నారు. అలాగే గతంలో వివిధ మండలాల్లో దివ్యాంగులు, వయోవృద్ధులు తమ సమస్యలపై ఆర్జీలు పెట్టుకున్నా.. సమస్య పరిష్కారం కాకపోతే ఈ ప్రత్యేక ప్రజావాణిలో మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.