నేను రాసే కథలు కేవలం నా కోసమే : అడివి శేష్

నేను రాసే కథలు కేవలం నా కోసమే : అడివి శేష్

డిఫరెంట్ కాన్సెప్టులను సెలెక్ట్ చేసుకుంటూ వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు అడివి శేష్. ప్రస్తుతం మరో రెండు పాన్ ఇండియా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఆదివారం తన  పుట్టిన రోజు సందర్భంగా శేష్ చెప్పిన విశేషాలు. 

‘‘ ఈ ఏడాది నా నుంచి ఒక్క సినిమా కూడా రాలేదనే ఫీలింగ్ ఏమీ లేదు.  మేజర్, హిట్ 2 బ్యాక్ టు బ్యాక్ వచ్చినట్టు.. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వస్తాయి. నా  జర్నీ ఎక్కడివరకూ వచ్చిందనే దాని కంటే ఆ జర్నీని ఎంత ఆనందిస్తున్నామనేది ముఖ్యం. అయినా ఈ ఏడాది మొత్తం ప్రిపరేషన్‌‌‌‌లోనే గడిచింది. గూఢచారి2తో పాటు శ్రుతి హాసన్‌తో కలిసి నటిస్తున్న సినిమాకి రైటింగ్ వర్క్ చేశా. జీ2 మూవీ మంచు కొండల్లో మొదలౌతుంది. మొదటి పార్ట్ కథ రాసుకున్నప్పుడే సీక్వెల్ అనుకున్నా.

అయితే ఆడియెన్స్ కోరుకున్నప్పుడు ఆ సీక్వెల్ అనౌన్స్ చేస్తే అందులో వున్న కిక్ వేరు. ఇది చాలా మ్యాసీవ్ ఫిల్మ్. ఐదు దేశాల్లో జరిగే కథ. కచ్చితంగా అన్ని భాషల వారికి నచ్చుతుందనే నమ్మకం ఉంది.  శ్రుతి హాసన్‌‌‌‌తో చేస్తున్న సినిమా వెరీ ఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ. హైలీ ఎమోషనల్ యాంగ్రీ ఫిల్మ్. దీన్ని హిందీ, తెలుగు.. రెండు భాషల్లో సెపరేట్‌‌‌‌గా షూట్ చేస్తున్నాం. కల్చర్ ప్రకారం ప్రతి సీన్ ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్‌‌‌‌గా ఉంటుంది. నటీనటుల ఎంపికలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

నేను గుడ్ యాక్టర్, గ్రేట్ రైటర్, బ్యాడ్ డైరెక్టర్ అని ఫీలౌతా(నవ్వుతూ). అందుకే యాక్టింగ్, రైటింగ్‌‌‌‌కే ప్రిఫర్ చేస్తాను. నేను రాసే కథలు కూడా కేవలం నా కోసమే. ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాల తర్వాత కేవలం నటుడిగానే మరో రెండు చిత్రాలు చేయబోతున్నా. నాకు డబ్బు మీద పెద్దగా ఆసక్తి లేదు. నా దృష్టి ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలనే దానిపైనే ఉంటుంది.  అందుకే  సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా చాలా సెలక్టివ్ సినిమాలే చేస్తున్నాను’’.