హైదరాబాద్: లాక్ డౌన్ కారణంగా రాష్ట్రంలో చిక్కుకున్నవారిలో 1225 వలస కార్మికులను శుక్రవారం ఉదయం లింగంపల్లి నుంచి జార్ఖండ్ లోని హతియాకు శ్రామిక్ ప్రత్యేక రైలులో తరలించిన సంగతి తెలిసిందే. మరికొంత మంది వలస కార్మికులను వారి రాష్ట్రానికి చేరవేసే క్రమంలో.. సిటీ శివారు నుంచి మంగళవారం రెండో శ్రామిక్ రైలు బయలు దేరింది. 1250 మంది కార్మికులతో ఘట్ కేసర్ నుంచి పట్నాకు మంగళవారం తెల్లవారుజామున మూడు గంటల 20 నిమిషాలకు శ్రామిక్ ప్రత్యేక రైలు బయలుదేరినట్టు తెలిపారు అధికారులు.
వలస కూలీలు, కార్మికులకు వైద్య బృందాలచే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత ప్రయాణానికి అంగీకరించారు. వివిధ ప్రాంతాల నుండి బస్సుల్లో వచ్చిన కార్మికులకు సోమవారం రాత్రి 11ల నుండి మంగళవారం ఉదయం 2 -30 వరకు స్క్రిన్ టెస్టులు నిర్వహించిన అధికారులు.. అనంతరం వారికి బోజనం ప్యాకేట్స్ పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక్క భోగిలో 120 మంది అయితే.. సోషల్ డిస్టెన్స్ పాటించి 60 మందిని మాత్రమే ఎక్కించారు. రెండు రోజుల నుంచి వివిధ పోలీసు స్టేషన్లలో పేర్లు నమోదు చేసుకున్న వారిని పంపించినట్టు అధికారులు తెలిపారు. ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ లో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్.