
చిన్న కాళేశ్వరానికి 12 ఏండ్లుగా ఎదురుచూపులే
కాంట్రాక్టర్లకు ఉపయోగపడే సివిల్ వర్క్లు కంప్లీట్
రైతులకు ఉపయోగపడే కాలువల నిర్మాణ పనులు పెండింగ్
జయశంకర్ భూపాలపల్లి/కాటారం, వెలుగు: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరం పేరుతో రెండు సాగు నీటి ప్రాజెక్ట్లు ఉన్నాయి. ఒకటి చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్. దీనిని లోకల్ ప్రాజెక్ట్గా చెబుతుంటారు. గోదావరి నది నుంచి 4.5 టీఎంసీల నీళ్లను లిఫ్ట్ చేసి ఇదే జిల్లాలోని మహాదేవ్పూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లో 45 వేల ఎకరాలకు సాగునీరందించే స్కీమ్ ఇది. 2008లో రూ.499 కోట్ల నిధులతో వైయస్ రాజశేఖర్ రెడ్డి టైంలో స్టార్ట్ చేశారు. రెండోది కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకం. కేసీఆర్ కలల ప్రాజెక్ట్. 2016లో రూ.1.20 లక్షల కోట్ల నిధులతో కేసీఆర్ హయాంలో మొదలైన స్కీమ్ ఇది. ఇవి రెండూ కాళేశ్వరం నుంచే గోదావరి వాటర్ను లిఫ్ట్ చేస్తాయి. రెండో ప్రాజెక్ట్ మూడేళ్లలోనే పూర్తయ్యి గతేడాదే వాటర్ పంపింగ్ స్టార్ట్ కాగా.. మొదటి ప్రాజెక్ట్ 12 ఏళ్లయినా అక్కడే పడకేసింది. ఒక్క మోటార్ను కూడా స్టార్ట్ చేయలేదు. ఇప్పటివరకు రూ.325 కోట్లు ఖర్చు చేసి కాంట్రాక్టర్లకు మాత్రమే ఉపయోగపడే సివిల్ వర్క్లను కంప్లీట్ చేశారు. రైతులకు ఉపయోగపడే పొలాలకు నీరందించే కాలువ పనులను మాత్రం ఇంకా మొదలు పెట్టలేదు.
4 మండలాలు.. 45 వేల ఎకరాలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గోదావరి తీర ప్రాంతంలో సాగునీటి కోసం రైతులు అనేక పోరాటాలు చేశారు. తలాపున గోదారి పారుతున్నా చుక్కనీరు ఉపయోగించుకోలేకపోతున్నామంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. దీంతో 2008లో అప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్ చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్కు రూపకల్పన చేసింది. రెండు పంప్హౌజ్లు ఏర్పాటు చేసి 4.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి నాలుగు మండలాలలోని 45 వేల ఎకరాలకు సాగునీరందించాలని ప్రాజెక్ట్ ప్రారంభించారు. పైప్లైన్లు, గ్రావిటీ కెనాల్స్ ద్వారా 62 గ్రామాల్లోని చెరువులను నింపి సాగునీరందిస్తామని ప్రకటించారు. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ పంపింగ్ స్టార్ట్ చేసే కన్నెపల్లికి దగ్గరలోనే బీరసాగర్ అనే ఊరు దగ్గర పంప్హౌజ్ నిర్మించి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసే స్కీం ఇది. రూ.571 కోట్లకు టెక్నికల్ శాంక్షన్స్ ఇవ్వగా రూ.499.23 కోట్లకు టెండర్లు ఓకే చేశారు. ఐవీఆర్సీఎల్‒ కేబీఎల్‒ మేయిల్(మెగా) కంపెనీలు జాయింట్ వెంచర్లో పనులు దక్కించుకున్నాయి. కేవలం మూడేళ్లలో కంప్లీట్ చేసేలా 2008 నవంబర్ నెలలో పనులు స్టార్ట్ చేశారు.
పెరుగుతున్న గడువు
2008 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో నాలుగు గవర్నమెంట్లు మారాయి. స్వరాష్ట్రం కూడా ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ కంటే 8 ఏళ్ల వెనుకాల స్టార్ట్ చేసిన కాళేశ్వరం భారీ ఎత్తిపోతల పథకాన్ని కూడా కంప్లీట్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్కు వేలాది ఎకరాల భూములు ఇచ్చిన లోకల్ రైతులకు ఉపయోగపడే చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పట్ల మాత్రం చిన్నచూపు చూస్తున్నారు. 2011లో పూర్తి కావాల్సిన ఈ పనులకు ఇప్పటికే 5 సార్లు గడువు పెంచారు. మార్చి 31, 2020లోపు పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టర్లకు ఆరోసారి ఈవోటీ ఇచ్చారు. రూ.499 కోట్ల ప్రాజెక్ట్లో కాంట్రాక్టర్లకు ఉపయోగపడే సివిల్ వర్క్లను కంప్లీట్ చేశారు. బీరసాగర్, కాటారంలో రెండు చోట్ల పంప్హౌజ్లు నిర్మించి 7 మోటార్లను అమర్చారు. స్టేజీ ‒1లో 44.04 కి.మీ పైప్లైన్కు గానూ 43.85 కి.మీ దూరం, స్టేజీ‒2లో 22.67 కి.మీ పైప్లైన్కు గానూ 16.42 కి.మీ. దూరం పైప్లైన్ వేశారు. 132/11 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించారు. ఫోర్బే కట్టారు. గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ తవ్వారు. చిన్న చితకా పనులు మినహా ఎలక్ర్టికల్, ఇంజినీరింగ్ వర్క్లు కంప్లీట్ చేశారు. బీరసాగర్ పంప్హౌజ్లో ఫోర్ బే 32 మీటర్ల లోతు ఉంటుంది. 35 మీటర్ల లోతు మోటార్ల దగ్గర ఉంటుంది. 20 మీటర్ల లెవల్ ఉన్నప్పుడు మోటార్లు నడిపించవచ్చు. ఇంకా నీళ్ల లిఫ్టింగ్ స్టార్ట్ చేయలేదు. పంట పొలాలకు నీళ్లందించే కాలువల నిర్మాణ పనులను మాత్రం మొదలు పెట్టలేదు.
చెరువులో తట్ట మట్టి కూడా తీయలేదు
-మా ఊరిలోని పెద్ద చెరువును రిజర్వాయర్ గా మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు. ఇప్పటి వరకు పైప్ లైన్లు మాత్రమే వేశారు. కానీ చెరువులో తట్ట మట్టి కూడా తీయలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా తయారైంది. రిజర్వాయర్ పనులు పూర్తయితే ఈ ప్రాంత రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుతుంది.
‒ వేల్పుల సరిత, పోలారం సర్పంచ్, మహాముత్తారం మండలం
రెండు పంప్హౌజ్లు రెడీ
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఆయకట్టు పంట పొలాలకు సాగునీరందించేందుకు అవసరమైన సివిల్ వర్క్లు కంప్లీట్ చేశాం. చిన్నాచితకా మినహా మొత్తం పైప్లైన్, రెండు పంప్హౌజ్లు రెడీగా ఉన్నాయి. మోటార్లను బిగించాం. ఇంకా 2 వేల ఎకరాల భూ సేకరణ పెండింగ్లో ఉంది. పంట పొలాలకు నీళ్లందించే, లింక్ చెరువులకు నీళ్లు పంపించే కాలువల నిర్మాణ పనులు మొదలుపెట్టలేదు.
‒ సత్య రాజచంద్ర, ఈఈ, చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్
నీళ్లొస్తే మోటార్ల బాధ తప్పుతది
ఏటా 5 ఎకరాలలో మిర్చి, పత్తి పండిస్తా . మా పక్క పొంటె గోదారి పారుతది కానీ ఏం లాభంలేదు. బోరుబావుల మీద ఆధార పడి మా పొలాలు పండిస్తాం. చేలకలకు, పొలాలకు విద్యుత్ మోటార్లె దిక్కైతివి. బరాబర్ చేన్లకు నీల్లక్కరున్న టైంలనే మోటార్లు రిపేరుకొస్తయి. మస్తు ఇబ్బంది అయితది. చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయితే కాలవలతో నీళ్లొస్తయని ఎదురు చూస్తన్నం.
‑ చిటికెల రవి, మహాదేవ్పూర్ రైతు
For More News..