
పురాణాలు.. పండితులు ఏం చెప్పినా .. దాని వెనుక కచ్చితంగా ఆరోగ్య సూత్రాలు ఉంటాయి. శ్రావణమాసం.. పూజల మాసం కదా..! ఈ నెలలో అమ్మవారికి పెట్టే నైవేద్యాల వెనుక ఎంతో ఆరోగ్యం ఉంది. అసలు శ్రావణమాసానికి.. ఆరోగ్యానికి గల సంబంధం ఏమిటో తెలుసుకుందాం.
ఏ నోము నోచుకున్నా.. ఏ వ్రతం చేసినా దాని వెనుక ఆధ్యాత్మికంతో పాటు సైన్సు కూడా ఉందని చెబుతుంటారు. అలానే ఎన్నో యుగాలనుంచి వస్తున్న శ్రావణమాసం పూజలు.. వ్రతాల వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఉందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
శ్రావణమాసమంటే మహిళలకు సందడే సందడి . పూజలు, వ్రతాలు, నోములు నోచి సౌభాగ్యము , ఐశ్వర్యము కలగాలని కోరుకుంటారు . అయితే ఇందులో అంతర్లీనము గా ఆరోగ్య రహస్యము కూడా ఇమిడి ఉందని నిపుణలు చెబుతున్నారు. సాధారణంగా శ్రావణమాసం పూజలలో అమ్మవారికి తొమ్మిది రకాలైన ప్రసాదాలను సమర్పిస్తుంటారు. వీటిని తినడం ఇమ్యూనిటి పవర్ పెరిగి వర్షాకాలంలో వచ్చే వ్యాధుల బారి నుండి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వర్షాకాలము ప్రారంభం లో ప్రబలే పలు రకాల వ్యాధుల నుంచి తప్పించుకునేందుకు అవసరమైన రోగనిరోధక శక్తి ఈ వ్రతాల ద్వారా లభిస్తుంది. అమ్మవారి పూజల్లో తొమ్మిది రకాల పిండివంటలు , ఈ రుతువులో లభించే పండ్లు , వివిధ పుష్పాలు నివేదించి కుటుంబ సభ్యులంతా ప్రసాదంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యవంతులవుతారు. మహిళలు పేరంటం పేరుతో ఇరుగుపొరుగు వారిని ఆహ్వానించి పరస్పరము వెళ్ళి వాయినాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా స్నేహభావము పెరుగుతుంది .
తొమ్మిది రకాల పిండివంటలు
- 1. పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేస్తారు. వీటిని తినడం ద్వారా శరీరానికి కావలసిన ప్రోటీన్లు పుష్కలంగా అందుతాయి.
- 2. పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు . గ్లాసుడు బియ్యంలో అరగ్లాసు పెసరపప్పు , తగినంత పంచదార , జీలకర్ర వేస్తారు .. ఇది భుజించడం ద్వారా మేధస్సు పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
- 3. గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . గారెలంటే అందరికీ ఇష్టము కదా..! ఇందులొ ఎన్నో ప్రోటీన్లు ఉంటాయి .
- 4. పరమాన్నము : పాలను మరిగిస్తూ దానిలో నెయ్యి కలిపిన బియ్యాన్ని, పంచదార .. వేయడం ద్వారా పరమాన్నము గా తయారవుతుంది . దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది .
- 5. చక్కెర పొంగలి : బియ్యము , పాలు , నెయ్యి , పెసరపప్పు , జీడిపప్పు , కిస్ మిస్ , మిరియాలతో తయారు చేస్తారు. ఇవి మెదడు , ఇతర అవయవాలు చురుగ్గా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
- 6. పులిహోరా : బియ్యము , పసువు , జీడిపప్పు , వేరుసెనగ పప్పు , ఇంగువ వేసి తయారుచేస్తారు. దీనిని తినడం వల్ల శరీరములో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది .
- 7. చిట్టి బూరెలు : మినపపప్పు ముద్దగా చేసి కొద్దిగ మజ్జిగ కలిపి వేయించి చేస్తారు . ఇవి పిల్లలకు చాలా ఇష్టము.. ఇది చలువ చేస్తుంది .
- 8. పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెలు లలో ప్రోటీన్లు లభిస్తాయి.
- 9. గోధుమ ప్రసాదము : గోధుమ నూక , పంచదార , నెయ్యి , మిశ్రమముతో తయారుచేస్తారు . ఇది బలమైన ఆహారమమని వైద్యులు చెబుతున్నారు.