
గుర్తింపు లేకుండా నారాయణ, శ్రీచైతన్య ఇంటర్ కాలేజీలు కొనసాగడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. అలాంటి కాలేజీల్లో అడ్మిషన్లకు ఓకే చెప్తే స్టూడెంట్స్ పరిస్థితి ఏందని ఇంటర్మీడియెట్ బోర్డును ప్రశ్నించింది. ‘‘స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుతారా?’’ అని నిలదీసింది. ‘‘అఫిలియేషన్ లేదు. అయినా కాలేజీలుంటాయి. అన్నీ కండ్ల ముందు కనబడుతూనే ఉంటాయి. ఆఫీసర్లకు మాత్రం కనబడదు. అఫిలియేషన్ లేకుండా అడ్మిషన్లకు అవకాశం ఇస్తే నారాయణ, శ్రీచైతన్య లాంటి కాలేజీలకు మేలు జరుగుతుంది.
కానీ వాటిలో చదువుకున్న స్టూడెంట్స్ భవిష్యత్తు ఏమిటి? గుర్తింపు లేని చోట చదివి మంచి మార్కులతో పాసైన స్టూడెంట్స్కు తీరని అన్యాయమే జరుగుతుంది కదా? ఒకరిని హత్య చేసిన వ్యక్తి మరొకరిని హత్య చేయబోనని అండర్ టేకింగ్ ఇస్తే హంతుకుడిని విదిలేస్తారా? గుర్తింపు లేని కాలేజీల్లో స్టూడెంట్స్ చేరేలా మీరు పరోక్షంగా సహకరించినట్లు అనిపిస్తోంది” అని ఇంటర్బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిలియేషన్ లేని కాలేజీల్లో 15 వేల మందికి పైగా స్టూడెంట్స్ చదువుతున్నట్లు ఇంటర్ బోర్డే కోర్టు దృష్టికి తేవడాన్ని సీరియస్గా తీసుకుంది. అలాంటి కాలేజీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూల్స్కు వ్యతిరేకంగా కాలేజీలను నడుపుతున్నాయని దాఖలైన పిల్ను చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల డివిజన్ బెంచ్ సోమవారం విచారించింది.
షరతు పెట్టి అడ్మిషన్లకు ఓకే చెప్పాం: ఇంటర్ బోర్డు
ఇంటర్ బోర్డు తరఫున గవర్నమెంట్ స్పెషల్ ప్లీడర్ సంజీవ్కుమార్ వాదిస్తూ.. అఫిలియేషన్ లేకుండా, రూల్స్కు వ్యతిరేకంగా ఉన్న కాలేజీలను గుర్తించేందుకు అధికారులు తనిఖీలు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే వంద కాలేజీల తనిఖీ జరిగిందన్నారు. మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో నారాయణ, శ్రీచైతన్య సంస్థలకు చెందిన పలు కాలేజీలకు అఫిలియేషన్ లేదని గుర్తించినట్లు వివరించారు. ఫైర్ ఎన్వోసీ వంటివి అమలు చేయాలని షరతు పెట్టి అడ్మిషన్లకు పర్మిషన్ ఇచ్చినట్లు చెప్పారు. ఆ కాలేజీల్లో 15వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నట్లు తెలిపింది. గుర్తింపు లేని కాలేజీలకు జరిమానాలు విధిస్తున్నామన్నారు. ఇప్పటివరకు కొన్ని కాలేజీలు అడ్మిషన్లు అయ్యాక అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాయని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ల కంటే ముందే అఫిలియేషన్ అప్లికేషన్లు పరిశీలించేలా చేస్తామని ఆయన తెలిపారు. దీనిపై బెంచ్ స్పందిస్తూ.. ఇకపై చర్యలు తీసుకోవడం బాగానే ఉంటుందని, అయితే ఇప్పటివరకు జరిగిన దానికి, ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ జీవితాల గురించి ఏం చేస్తారని ప్రశ్నించింది.
స్టూడెంట్స్ పరిస్థితి ఏంది?: హైకోర్టు
పిటిషనర్ లాయర్ జగన్ వాదిస్తూ.. నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు రూల్స్కు వ్యతిరేకంగా పలు బ్రాంచీలున్నాయని, ఫైర్ ఎన్వోసీ లేదన్నారు. గుర్తింపు లేని కాలేజీల్లో చదువుతున్న 15 వేల మంది స్టూడెంట్స్ భవితవ్యం ఏమిటో హైకోర్టు విచారణ చేయాలని కోరారు. దీనిపై బెంచ్ కల్పించుకొని.. ‘‘15 వేల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆటలాడుతారా? గుర్తింపు లేని కాలేజీల్లో అడ్మిషన్లకు ఓకే చెప్పడమేంది? ఇదే తరహాలో ఒక కేసులో సుప్రీంకోర్టు బాధిత స్టూడెంట్కు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించిన విషయాన్ని మరిచిపోయారా? ఆదిలోనే ఇంటర్బోర్డు ఉక్కుపాదం మోపకపోతే ఇదే తరహాలో మరిన్ని కాలేజీలు పుట్టుకొస్తాయని తెలియదా? అదే జరిగితే మరింత మంది స్టూడెంట్స్ జీవితాలను మూల్యంగా చెల్లించుకోవాల్సివస్తుందని అధికారులకు తెలియదా?” అని నిలదీసింది. ‘‘భారీ తప్పిదానికి జరిమానాలు వేసి చేతులు దులుపుకుంటారా? మేము అమెరికాలో చదివి ఢిల్లీ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకుంటే తోసిపుచ్చారు. నిబంధనలు అంత కఠినంగా ఉంటాయి. అలాంటిది పదిహేను వేల మంది ఇంటర్ స్టూడెంట్స్ గుర్తింపులేని కాలేజీల్లో చదివితే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారు? చట్ట ప్రకారం ఆయా కాలేజీలపై తీసుకున్న చర్యలు ఏమిటో చెప్పండి” అని డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. అఫిలియేషన్ లేని కాలేజీల్లోని 15 వేల మంది స్టూడెంట్స్ గురించి ఏం చేస్తారో అదనపు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఇంటర్ బోర్డును ఆదేశించింది. విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది.