యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. రద్దీ కారణంగా కొండపైన బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు, కొండ కింద లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, వ్రత మండపాలు రద్దీగా మారాయి. భక్తులు అధికంగా రావడంతో స్వామి ధర్మ దర్శనానికి 3 గంటలు, స్పెషల్ దర్శనానికి గంట సమయం పట్టింది. మరోవైపు ఆలయంలో నిత్యపూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఆలయంలో స్వామి నిత్యకల్యాణం, సుదర్శన నారసింహ హోమం, సువర్ణ పుష్పార్చనలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.51,74,567 ఆదాయం వచ్చింది. ఇందులో ప్రసాద విక్రయం ద్వారా రూ.18.75 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.8.85 లక్షలు, కొండపైకి వాహనాల ఎంట్రీతో రూ.7.16 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.4.20 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
