
కొలంబో: కరోనా ఎఫెక్ట్తో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.. విదేశీ మారక నిల్వలు అడుగంటినయ్.. క్రూడాయిల్ కొనడానికి డాలర్లు లేక అప్పు కోసం ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు లోన్గా ఇవ్వాలంటూ మన దేశాన్ని అడిగింది. ఇందులో భాగంగా మన హై కమిషన్తో శ్రీలంక అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. దేశంలో ఇంధన వనరులు నిండుకుంటున్నయని శ్రీలంక ఎనర్జీ మినిస్టర్ కొన్ని రోజుల కిందటే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి క్రూడాయిల్ కొనుగోలు ప్రయత్నాలు మొదలెట్టింది. సింగపూర్ సహా దక్షిణాసియా దేశాల నుంచి శ్రీలంక క్రూడ్, రిఫైన్డ్ ప్రొడక్టులను కొని, ప్రభుత్వరంగ బ్యాంకుల ద్వారా డాలర్లలో చెల్లింపులు చేస్తుంది. అయితే, కరోనా వల్ల పర్యాటక రంగం దెబ్బతిని ప్రభుత్వానికి ఆదాయం కుంటుపడింది. దీని ఎఫెక్ట్తో దేశంలో విదేశీ మారకనిల్వలు తగ్గిపోయినయ్. ఆర్థిక సంక్షోభం వల్ల డాలర్తో శ్రీలంక రూపాయి విలువ 9 శాతం పడిపోయింది. ఫలితంగా డాలర్ మరింత ప్రియంగా మారి, క్రూడాయిల్ బడ్జెట్ను పెంచింది. మరోవైపు, క్రూడాయిల్ కొనుగోలు వ్యవహారంలో ప్రభుత్వరంగంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్(సీపీసీ) భారీ మొత్తంలో అప్పుల్లో కూరుకుపోయింది. సిలోన్ బ్యాంకు, పీపుల్స్ బ్యాంకులకు ఇప్పటికే 3.3 బిలియన్ల అమెరికా డాలర్లు బకాయిపడ్డది. ఈ పరిణామాలతో ఇండియా నుంచి అప్పు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇండియన్ హైకమిషన్తో సీపీసీ అధికారులు భేటీ అయ్యారు. ఇండియా శ్రీలంక ఎకనామిక్ పార్ట్నర్షిప్ అరేంజ్మెంట్ కింద 500 మిలియన్ల అమెరికన్ డాలర్లు అప్పుగా తీసుకోనున్నట్లు సీపీసీ చైర్మన్ సుమిత్ విజెసింఘె చెప్పారు. త్వరలోనే రెండు దేశాల ఎనర్జీ సెక్రటరీలు దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని ఆయన వివరించారు.