నస్పూర్, వెలుగు : ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని శ్రీరాంపూర్ సీఐ శ్రీలత సూచించారు. శనివారం శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ–3 గని వద్ద రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. రోజురోజుకూ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని, దీనికి ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడమే కారణమన్నారు.
వాహనదారులు బాధ్యతగా భావించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఎస్ఐ సంతోష్, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు పాల్గొన్నారు.
