బల్దియాలో తీవ్రమైన సిబ్బంది కొరత

బల్దియాలో తీవ్రమైన సిబ్బంది కొరత
  • 27,562 మంది ఔట్​సోర్సింగ్ సిబ్బంది
  • 13 ఏండ్లుగా ఔట్ సోర్సింగ్ పద్ధతిన ఒక్కరినీ తీస్కోలే
  • ఉన్నవారిపై పెరిగిపోతున్న పనిభారం

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో సరిపడా సిబ్బంది లేరు. కోటి 20 లక్షలకు పైగా ఉన్న గ్రేటర్​ జనాభాకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే ఆయా విభాగాల్లో దాదాపు లక్ష మంది అవసరం. ప్రస్తుతం ఔట్​సోర్సింగ్, పర్మినెంట్​ సిబ్బందిని మొత్తం కలిపినా ఉన్నది 31వేల మంది మాత్రమే. వీరిలో 27,562 మంది ఔట్​సోర్సింగ్​ సిబ్బందే కావడం గమనార్హం. ఇతర రాష్ట్రాల్లోని సిటీలతో పోలిస్తే జీహెచ్ఎంసీలో చాలా తక్కువ మంది సిబ్బంది ఉన్నారు. ముంబై, బెంగళూరు, చెన్నై తదితర సిటీల్లో అక్కడి అధికారులు జనాభాకు సరిపడా నియామకాలు చేస్తున్నారు. మన దగ్గరి కంటే రెండు, మూడింతలు ఎక్కువగానే పనిచేస్తున్నారు. చిన్న సిటీ అయిన పుణెలో హైదరాబాద్​కంటే ఎక్కువ మంది ఉన్నారని తెలుస్తోంది. సిటీ మొత్తం క్లీన్​గా ఉండాలంటే శానిటేషన్​వర్కర్లదే కీలకపాత్ర. బల్దియా అధికారులు కనీసం వీరి సంఖ్యను కూడా పెంచడం లేదు. ఔట్​సోర్సింగ్​పద్ధతినైనా తీసుకోవడం లేదు. తెలంగాణ ఏర్పడ్డాక వేసిన ప్రసాద్​రావు కమిటీ, ఆల్ పార్టీ కమిటీలు జీహెచ్ఎంసీలో 60 శాతం ఖాళీలు ఉన్నాయని, వెంటనే పెంచాలని సూచించాయి. ఏండ్లు గడుస్తున్నా ఇప్పటివరకు పట్టించుకోలేదు. సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా 13 ఏండ్లుగా ఔట్​సోర్సింగ్​పద్ధతిన ఒక్కరినీ కూడా తీసుకోలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం అవుతోంది. ఎంతో కీలకమైన ఇంజనీరింగ్, టౌన్​ ప్లానింగ్, శానిటేషన్ విభాగాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సరిపడా సిబ్బంది లేక ఆయా విభాగాల్లో పనిచేస్తున్నవారిపై పనిభారం పెరిగిపోతోంది.   

వీఐపీ రోడ్లతో సరి
జీహెచ్ఎంసీలో ఔట్​సోర్సింగ్​పద్ధతిన మొత్తం 18,352 శానిటేషన్ వర్కర్లు పనిచేస్తున్నారు. రోజూ రోడ్లు క్లీన్​ చేయడం, కాలనీల్లో చెత్త ఉంటే ఎత్తివేయడం వీరి పని. కానీ ఉన్న జనాభాకు వీరితోసేవలు అందించడం కష్టం అవుతోంది. వీఐపీలు తిరిగే మెయిన్​రోడ్లు ఊడ్చేలోపే టైం అయిపోతుంది. కాలనీల్లో రెండు, మూడు రోజులకోసారి ఊడుస్తున్నారు. సిటీలో రోడ్లన్నీ రోజూ క్లీన్​చేయాలంటే దాదాపు 50 వేల మంది శానిటేషన్​వర్కర్లు అవసరమని నిపుణులు చెబుతున్నారు. శానిటేషన్​తర్వాత అంతే కీలకమైన ఎంటమాలజీ విభాగంలోనూ ఇదే పరిస్థితి ఉంది. కేవలం 2,292 మంది ఔట్​ సోర్సింగ్​సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. కోటి 20 లక్షల మందిని దోమలు కుట్టకుండా, రోగాల బారిన పడకుండా చూడాల్సిన వీరి సంఖ్య ఇంత తక్కువగా ఉందంటే మిగిలిన విభాగాల్లో పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. సిటీ క్లీన్ అండ్ గ్రీన్​గా ఉండాలన్నా, టైంకు ట్యాక్సులు వసూలు చేయాలన్నా లక్ష మంది సిబ్బంది ఉండాలని నిపుణులు అంటున్నారు. అప్పుడే హైదరాబాద్​దేశంలో నంబర్ వన్​అయ్యేదని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోరని, అన్ని విభాగాల్లో కొత్తవారిని తీసుకోవాలని ఉద్యోగ సంఘాల నాయకులు డిమాండ్​ చేస్తున్నారు.

విభాగాల వారీగా ప్రస్తుతం ఉన్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది
విభాగం    సిబ్బంది
ఎస్ఎఫ్ఏ    948
శానిటేషన్    18,352
ఎంటమాలజీ    2,292
వెటర్నరీ    500
ట్రాన్స్​పోర్ట్​    2,500
 హార్టికల్చర్​    400
హౌస్​కీపింగ్​    620
సెక్యూరిటీ గార్డ్స్​    500
డాటా ఎంట్రీ    850
సీవరేజీ    600
మొత్తం    27,562

పెంచమని కొన్నేండ్లుగా డిమాండ్​ చేస్తున్నం
కోటి20 లక్షల మంది ఉన్న మహా నగరంలో పనిచేసేందుకు కనీసం లక్ష మంది సిబ్బంది అవసరం. ఈ విషయాన్ని కొన్నేండ్లుగా చెబుతున్నాం. కానీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోవడంలేదు. కొత్తవారిని తీసుకోవడం లేదు. రెగ్యులర్​సిబ్బందిలో నెలకి 50 మంది వరకు రిటైర్డ్​అవుతున్నారు. దీంతో ఉన్నవారిపై పని భారం పెరుగుతోంది. కనీసం ఔట్​సోర్సింగ్ పద్ధతిన తీసుకుంటే కొంత మేర జనానికి సేవలు అందుతాయి. - ఊదరి గోపాల్, జీహెచ్ఎంసీ ఎంప్లాయీస్​ యూనియన్ ప్రెసిడెంట్