
న్యూఢిల్లీ: ఈ సీజన్లో చాలా సవాళ్లు ఎదురైనా.. వచ్చే ఏడాది మరింత బలంగా తిరిగి వస్తానని ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా అన్నాడు. బలమైన పునరాగమనం కోసం కఠినంగా శ్రమిస్తున్నానని చెప్పాడు. ‘ఈ సీజన్ మొత్తం సవాళ్లతో కూడుకున్నది. గర్వించదగినవి, నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి.
ప్రతి పోటీ నా అనుభవాన్ని, విశ్వాసాన్ని పెంచింది. అయితే మెరుగుపడటానికి ఎల్లప్పుడూ అవకాశం ఉంటుంది. అదే నన్ను ఉత్సాహపరుస్తుంది’ అని జ్యూరిచ్లో ఉన్న నీరజ్ వెల్లడించాడు. వెన్ను నొప్పి కారణంగా గత నెలలో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్లో పతకం లేకుండానే తిరిగొచ్చిన నీరజ్.. ప్రస్తుతం జ్యూరిచ్లో కోలుకుంటున్నాడు. అక్కడి ఆల్ఫ్ పర్వతాలను వీక్షిస్తూ, స్విస్ అందాలను తిలకిస్తూ, పచ్చని ప్రకృతి దృశ్యాల మధ్య సేద తీరుతున్నాడు.
అదే క్రమంలో వెన్ను నొప్పి నుంచి కోలుకోవడంతో పాటు ఇంటర్ లేకెన్, బెర్న్స్, లౌసాన్లో జరిగే రికవరీ సెషన్లకు హాజరవుతున్నాడు. ‘ఇప్పుడు నా దృష్టంతా కోలుకోవడంపైనే ఉంది. తదుపరి సీజన్కు బలంగా ఉండాలి. శరీరం బాగా అనిపిస్తున్నది. కొంచెం విశ్రాంతి, కొంచెం శిక్షణ, మధ్యలో స్విస్ అందాలను తిలకిస్తూ ట్రెయినింగ్లో పాల్గొంటున్నా. మరింత బలంగా, పదునుగా తిరిగి వస్తాననే నమ్మకం ధృడంగా ఉంది’ అని నీరజ్ వెల్లడించాడు. పచ్చని ప్రకృతి మధ్య చేస్తున్న రైలు ప్రయాణాలు తనను చాలా ఆకర్షించాయన్నాడు.
ప్రకృతి దృశ్యం కోసం లౌసాన్, పర్వతాల కోసం జెర్మాట్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. 2022లో స్విస్ టూరిజమ్.. ‘ఫ్రెండ్షిప్ అంబాసిడర్’గా నీరజ్ను సత్కరించింది. అప్పట్లో ‘టాప్ ఆఫ్ యూరప్’ అని పిలిచే జంగ్ఫ్రాజోచ్లోని ప్రసిద్ధ ఐస్ ప్యాలెస్ను కూడా చోప్రా సందర్శించాడు. ట్రెయినింగ్కు ముందు మనసు, శరీర అలసట నుంచి కోలుకోవడానికి జ్యూరిచ్, ముర్రెన్కు వెళ్లడం ఓ గొప్ప మార్గమమని నీరజ్ అన్నాడు. ‘వేసవిలో మీరు ఇక్కడికి వచ్చినప్పుడు, పచ్చదనం మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. నాకు ఇక్కడి పర్వతాలు చాలా ఇష్టం. అవి శుభ్రంగా, నిర్మలంగా, అందంగా కనిపిస్తాయి. నేను జ్యూరిచ్ (2022) డైమండ్ లీగ్ ట్రోఫీని గెలిచా.
ఇది నాకు చాలా ప్రత్యేకమైంది. నేను మాగ్లింగెన్లో శిక్షణ తీసుకున్నా. అక్కడ స్విస్ ఒలింపిక్ శిక్షణా కేంద్రం కూడా ఉంది. బుడాపెస్ట్లో జరిగిన వరల్డ్ చాంపియన్షిప్ (2023) ముందు ఇక్కడే శిక్షణ తీసుకున్నా. అక్కడ గోల్డ్ మెడల్ సాధించా. కాబట్టి నాకు ఇక్కడ చాలా సంతోషకరమైన జ్ఞాపకాలు ఉన్నాయి. డైమండ్ లీగ్ ట్రోఫీ గెలిచిన తర్వాత నేను, నా కుటుంబం, స్నేహితులతో కలిసి ఈ దేశాన్ని అన్వేషించాను. అది నేను ఎప్పటికీ మరచిపోలేని విషయం. ఇది నాకు ఎంతో ఇష్టమైన ప్రదేశం’ అని నీరజ్ వివరించాడు.