- ఈ ఏడాది స్టార్టప్లు తీసేసిన ఉద్యోగులు10 వేలకు పైనే!
- ఫండింగ్ దొరకకపోవడంతోనే..
బిజినెస్ డెస్క్, వెలుగు: బీఎండబ్ల్యూ కార్లు, పెద్ద మొత్తంలో శాలరీ ఆఫర్లు, బోనస్లు..ఇదంతా కిందటేడాది మాట. ఈ ఏడాది ఉన్న ఉద్యోగులను మెయింటెయిన్ చేయడానికే స్టార్టప్లు ఇబ్బంది పడుతున్నాయి. ఫండింగ్ దొరకకపోవడంతో ఖర్చులు తగ్గించుకోవడానికి భారీగా ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 10,500 మంది ఉద్యోగులను స్టార్టప్ కంపెనీలు తొలగించాయని మనీ కంట్రోల్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. కిందటేడాది స్టార్టప్ కంపెనీల్లోకి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వడ్డీ రేట్లు తక్కువగా ఉండడంతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల నుంచి కూడా స్టార్టప్లు తక్కువ వడ్డీకే ఫండ్స్ను సేకరించుకోగలిగాయి. కానీ, ఈ ఏడాది స్టార్టప్ల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లోన్లు తీసుకోవడం ఖరీదుగా మారగా, ఇన్వెస్టర్లు కూడా స్టార్టప్లలో డబ్బులు పెట్టడానికి ముందుకు రావడం లేదు. సేల్స్, మార్కెటింగ్ సెగ్మెంట్లలో పనిచేసే ఉద్యోగులను స్టార్టప్ కంపెనీలు ఎక్కువగా తొలగించాయి. ఇంజనీరింగ్, ప్రొడక్ట్ సెగ్మెంట్లలోని ఉద్యోగులను తక్కువగా తొలగించాయి.
ఎక్కువ మందిని తీసేసింది ఎడ్టెక్ స్టార్టప్లే..
ఎడ్టెక్ స్టార్టప్లే ఈ ఏడాది ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించాయి. అన్అకాడమీ మొదటి రౌండ్లో 600 మందిని, ఆ తర్వాత 150 మందిని తీసేసింది. అన్అకాడమీ, వేదాంతు, లిడో లెర్నింగ్, మరికొన్ని ఎడ్టెక్ స్టార్టప్లు కలిపి ఈ ఏడాది సుమారు 4 వేల మంది ఉద్యోగులను తీసేశాయి. ఈ ఏడాది స్టార్టప్ కంపెనీలు తీసేసిన మొత్తం ఉద్యోగుల్లో ఎడ్టెక్ స్టార్టప్లు తీసేసిన ఉద్యోగుల వాటా 38 శాతంగా ఉంది. స్కూళ్లు, కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు ఓపెన్ అవుతుండడంతో ఆన్లైన్ ఎడ్యుకేషన్కు డిమాండ్ తగ్గుతోంది. మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతోపాటు ఫండింగ్ పొందడం కష్టంగా మారడంతో ఎడ్టెక్ స్టార్టప్లు ఇబ్బంది పడుతున్నాయి. మీషో, కార్స్24, ఓలా, బ్లింకిట్ వంటి వివిధ సెక్టార్లలో విస్తరించిన స్టార్టప్లు కూడా ఈ ఏడాది తమ ఉద్యోగులను భారీగా తీసేశాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 25 స్టార్టప్ కంపెనీలు తమ ఉద్యోగులను ఎక్కువగా తొలగించాయి. ఫండింగ్ దొరకడంలేదని కొన్ని , రీస్ట్రక్చరింగ్ చేస్తున్నామని మరికొన్ని ఉద్యోగులను తీసేశాయి.