- సిబ్బందికి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ శిక్షణ ఇస్తాం
- మండల స్థాయిల్లో అడ్వాన్సుడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొని, ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడమే లక్ష్యంగా విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్మెంట్) విభాగాన్ని బలోపేతం చేస్తున్నట్లు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విభాగాన్ని దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు.
బుధవారం సెక్రటేరియెట్లో విపత్తుల నిర్వహణ విభాగం, ఫైర్ సర్వీసెస్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, ఐసీసీసీ అధికారులతో సమీక్ష ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు రూ.100 కోట్లతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేందుకు వీలుగా సాంకేతికతను జోడిస్తున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగా ముందస్తు హెచ్చరికలు, కచ్చితమైన సమాచారం, రియల్టైమ్ మానిటరింగ్ కోసం డ్రోన్లు, శాటిలైట్ ఆధారిత కమ్యూనికేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. విపత్తు నిర్వహణ సిబ్బందికి మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్డించారు. 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలకు నిరంతర శిక్షణ ఇస్తామన్నారు. స్థానిక పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేసేలా.. మండల స్థాయి వరకు ‘అడ్వాన్స్డ్ వెదర్ స్టేషన్ల’ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఎయిర్ లిఫ్ట్ మెకానిజం తెస్తాం..
భారీ వర్షాలు, వరదల వేళ వాగులు, వంకల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక ఎయిర్ లిఫ్ట్ మెకానిజం రూపొందించాలని మంత్రి పొంగులేటి సూచించారు. గతేడాది తన సొంత నియోజకవర్గం పాలేరులో వాగుల్లో చిక్కుకున్న వారిని ఎయిర్ లిఫ్ట్ వ్యవస్థ లేకపోవడం వల్ల కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలా జరగకూడదనే ఉద్దేశంతో 70 నుంచి 80 కిలోల బరువును ఎత్తగలిగే భారీ డ్రోన్లను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి రాష్ట్రంలోని ఏ మారుమూల ప్రాంతానికైనా సంప్రదించేలా సిమ్ ఆధారిత వీహెచ్ఎఫ్ రేడియో వ్యవస్థను విస్తరించాలని సూచించారు. అలాగే, హైదరాబాద్లో ఎత్తైన భవనాల్లో అగ్నిప్రమాదాలను అరికట్టే పరికరాలు, వరదల్లో సహాయక చర్యల కోసం 77 హైస్పీడ్ బోట్లను సమకూర్చుకోవాలని హైడ్రా కమిషనర్ను సూచించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, ఫైర్ డైరెక్టర్ విక్రమాన్ సింగ్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.
మేడారం ఏర్పాట్లపై ఆరా..
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను మంత్రి పొంగులేటి ఆదేశించారు. జాతరలో అత్యంత కీలకమైన మొదటి ఘట్టం బుధవారం ప్రారంభం కావడంతో.. సెక్రటేరియెట్ నుంచే హై ఫ్రీక్వెన్సీ వాకీటాకీ ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందితో ఆయన మాట్లాడారు. ట్రాఫిక్ నియంత్రణ, తాగు నీరు, రవాణా సౌకర్యాలపై ఆరా తీశారు. పోలీసు, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేసి తెలంగాణ కుంభమేళాను విజయవంతం చేయాలని సూచించారు.
