
- డీజీపీ, గ్రేటర్ సీపీలతో చర్చించిన హోంమంత్రి
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న వరుస ఘటనలతో రాష్ట్ర హోంశాఖ అలర్ట్ అయ్యింది. ఎల్బీనగర్లో లక్ష్మీపై పోలీసుల దాడి, మీర్పేట నందనవనంలో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనల నేపథ్యంలో హోంమంత్రి మహమూద్ అలీ మంగళవారం సెక్రటేరియట్లో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు.
హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జితేందర్, డీజీపీ అంజనీకుమార్, సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, డీఎస్ చౌహన్ సహా సిటీ అడిషనల్ సీపీలు, జాయింట్సీపీలు విక్రమ్ సింగ్ మాన్, జాయింట్ సీపీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న నేరాలు, హత్యల వివరాలను హోంమంత్రి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. భూ తగాదాలు, సెటిల్మెంట్లకు సంబంధించినవి, సోషల్ మీడియాలో ముఖ్యంగా బర్కాస్లో ఫేక్ న్యూస్ సర్క్యులేషన్ లాంటి నేరాలు జరుగుతున్నాయని అన్నారు.
చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో రౌడీషీటర్ల నేరాలు పెరిగిపోయాయని అన్నారు. చీకటి ప్రదేశాలు, భారీ నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలు, రౌడీషీటర్లపై 24 గంటలు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఫ్లై ఓవర్లు, స్కూళ్లు, సైట్స్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ వల్ల జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
ఓల్డ్ సిటీలోని ఫంక్షన్ హాల్స్, హోటల్స్, జిమ్లు, పాన్షాప్లు నిర్దేశించిన సమయాల్లో మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టింగ్స్ చేసే గ్రూపులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. గ్రేటర్ జనం పోలీసులకు సహకరించాలని కోరారు.