హైదరాబాద్, వెలుగు: వరుసగా ఆరో సెషన్లోనూ లాభపడిన మార్కెట్లు సోమవారం కొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ ఏడాది జనవరిలో క్రియేట్ చేసిన ఆల్టైమ్ గరిష్టాలను సోమవారం సెషన్లో దాటేశాయి. ఇంట్రాడేలో 42,645 వద్ద సెన్సెక్స్, 12,474 వద్ద నిఫ్టీ ఆల్టైమ్ రికార్డ్లను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 704 పాయింట్లు పెరిగి 42,597 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ 198 పాయింట్లు లాభపడి 12,461 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ప్రెసిడెంట్గా జో బైడెన్ ఎన్నికవ్వడంతో గ్లోబల్ మార్కెట్లు పాజిటివ్గా ట్రేడవుతున్నాయి. దీంతో ఇండియన్ మార్కెట్లలో కూడా కొనుగోళ్లు పెరిగాయి. ముఖ్యంగా బ్యాంకులు, ఫైనాన్షియల్, ఐటీ స్టాకులు రాణించాయి. 30 షేర్లున్న సెన్సెక్స్లో కేవలం మూడు షేర్లు మాత్రం నష్టాల్లో క్లోజయ్యాయి. భారతి ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు ఎక్కువగా లాభపడ్డాయి. బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, మారుతి షేర్లు నష్టాల్లో క్లోజయ్యాయి. 50 షేర్లున్న నిఫ్టీలో ఏడు షేర్లు మినహా మిగిలిన షేర్లన్ని పాజిటివ్గా ముగిశాయి. యూఎస్ ప్రెసిడెంట్గా జో బైడెన్ ఎన్నికవ్వడంతో ఆసియా మార్కెట్లతో పాటే ఇండియన్ మార్కెట్లు కూడా సోమవారం లాభాల్లో ఓపెన్ అయ్యాయని ఆనంద్ రాఠి ఈక్విటీ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి అన్నారు. ఇండియన్ ఐటీ, ఫైనాన్షియల్ మార్కెట్లకు లాభం చేకూర్చే నిర్ణయాలను జో బైడెన్ తీసుకుంటారని ఇన్వెస్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ నెలలోని మొదటి ఐదు ట్రేడింగ్ సెషన్లలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పీఐ) ఏకంగా రూ. 8,381 కోట్లను ఇండియన్ మార్కెట్లలో పెట్టారు. దేశంలో బిజినెస్ యాక్టివిటీ తిరిగి స్టార్టవ్వడం, కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాల కంటే బాగుండడంతో ఇండియన్ మార్కెట్లపై ఇన్వెస్టర్లు సానుకూలంగా ఉన్నారని సోలంకి తెలిపారు. శుక్రవారం సెషన్లో ఎఫ్పీఐలు రూ. 4,870 కోట్లను మార్కెట్లలో పెట్టారు.
7 పైసలు తగ్గిన రూపాయి
డాలర్ మారకంలో రూపాయి 7 పైసలు తగ్గి 74.15 స్థాయికి చేరుకుంది. సోమవారం సెషన్ ప్రారంభంలో డాలర్ మారకంలో పెరిగిన రూపాయి విలువ, క్రూడాయిల్ ధరలు పెరగడంతో సెషన్ చివరి నాటికి తగ్గింది. దీంతోపాటు డాలర్ మారకంలో ఆసియా కరెన్సీలు బలహీనంగా ఉండడం కూడా రూపాయి విలువ తగ్గడానికి కారణమయ్యాయి. ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి సోమవారం 73.95 వద్ద ఓపెన్ అయ్యింది. ఇంట్రాడేలో మరింత బలపడి 73.83 స్థాయిని తాకింది. కానీ ఈ లాభాలను నిలుపుకోవడంలో ఫెయిల్ అవ్వడంతో చివరకి 7 పైసలు బలహీనపడి 74.15 వద్ద క్లోజయ్యింది. గత సెషన్లో డాలర్ మారకంలో రూపాయి 28 పైసలు బలపడి 74.08 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడాయిల్ 2.15 శాతం లాభపడి బ్యారెల్ 40.30 డాలర్లకు చేరుకుంది. బంగారం ధరలు వరుసగా నాల్గో సెషన్లోనూ పెరిగాయి. ఢిల్లీలో 10 గ్రాముల గోల్డ్ ధర సోమవారం రూ. 277 పెరిగి రూ. 52,183 ను తాకింది. గత సెషన్లో 10 గ్రాముల గోల్డ్ రూ. 51,906 వద్ద క్లోజయ్యింది. వెండి(కేజి) ధర కూడా సోమవారం రూ. 694 పెరిగి రూ. 65,699 స్థాయిని చేరుకుంది. గత సెషన్లో ఈ ధర రూ. 65,005 గా ఉంది.
10 నెలల్లో 63 లక్షల కోట్లు
ఈ ఏడాది మార్చి 23 న దేశీయ మార్కెట్లు తమ మల్టీ ఇయర్ కనిష్టాలకు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ సెషన్ నుంచి మొత్తం 202 సెషన్లలో మార్కెట్లు తిరిగి ఆల్టైమ్ గరిష్టాలకు చేరుకోగలిగాయి. మార్చి 23 కనిష్టాల కంటే నిఫ్టీ, సెన్సెక్స్ 66 శాతానికి పైగా లాభపడ్డాయి. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద రూ. 63 లక్షల కోట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరిలో సెన్సెక్స్ రికార్డు స్థాయిలను చేరుకున్నప్పటి నుంచి సోమవారం సెషన్ వరకు గమనిస్తే 13 షేర్లు రెండింతలు పెరిగాయి. ఈ టైమ్లో ఆలోక్ ఇండస్ట్రీస్ 718 శాతం లాభపడింది. దివాలాకు వచ్చిన ఈ కంపెనీని రిలయన్స్ ఇండస్ట్రీస్, జేఎం ఫైనాన్షియల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీలు కొనుగోలు చేశాయి. ఆలోక్ ఇండస్ట్రీస్ తర్వాత అదాని గ్రీన్ ఎనర్జీ, లారస్ ల్యాబ్స్, ఆల్కైల్ అమైన్స్, గ్రాన్యూల్స్ ఇండియా, బిర్లాసాఫ్ట్, డిక్సాన్ టెక్నాలజీస్, ఇండియామార్ట్, నవిన్ ఫ్లోరిన్, టాటా కమ్యూనికేషన్, వైభవ్ గ్లోబల్, జేబీ కెమికల్స్, థైరోకేర్ టెక్నాలజీస్ షేర్లు 100 నుంచి 350 శాతం పెరిగాయి. ఇదే టైమ్లో బీఎస్ఈ 500 ఇండెక్స్లోని 300 లకు పైగా కంపెనీలు తమ షేరు వాల్యూలో సగానికి పడిపోయాయి. ఇందులో ఫ్యూచర్ రిటైల్, ఫ్యూచర్ కన్జూమర్ షేర్లు 80 శాతం, 72 శాతం మేర తగ్గాయి. వీటితో పాటు జీఈ పవర్, చాలెట్ హోటల్స్, అరవింద్ ఫ్యాషన్స్, రేమండ్, కెనరా బ్యాంక్, టాటా కెమికల్స్, డీసీబీ బ్యాంక్, షాపర్స్ స్టాప్, ఓమ్యాక్స్, పీఎన్బీ, యూనియన్ బ్యాంక్, జీఐసీ, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.