ముంబై : సెన్సెక్స్, నిఫ్టీలు రెండూ మంగళవారం సెషన్లో ఆల్టైమ్ హై వద్ద క్లోజయ్యాయి. ఏషియన్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతోపాటు, విదేశీ పెట్టుబడిదారుల కొనుగోళ్లతో ఇండెక్స్లు మరోసారి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 177 పాయింట్ల లాభంతో 62,682 వద్ద, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 18,618 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 62,887 పాయింట్లను తాకింది. సెన్సెక్స్లో హిందుస్తాన్ యునిలివర్, సన్ఫార్మా , నెస్లే, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాలు గడించాయి. మరోవైపు ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్, మారుతి, పవర్ గ్రిడ్, లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు నష్టాలపాలయ్యాయి.
సియోల్, షాంఘై, హాంకాంగ్ మార్కెట్లు లాభాల్లో ముగియగా, టోక్యో ఎక్స్చేంజి మాత్రం నష్టాలలో ముగిసింది. యూరప్ మార్కెట్లో మధ్యాహ్నానికి స్వల్ప నష్టాలతో ట్రేడవుతున్నాయి. లాభాలతో మొదలైన మన మార్కెట్లు ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్ కొనుగోలుకు ఎగబడటంతో మధ్యాహ్నం సెషన్లోనూ ఇదే ట్రెండ్ కొనసాగించాయి. నవంబర్ నెలలో ఎఫ్ఐఐలు రూ. 32,344 కోట్లు పెట్టుబడి పెట్టడంతో పాజిటివ్ ట్రెండ్ బలపడిందని ఆనంద్ రాఠి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ హెడ్ రిసెర్చ్ నరేంద్ర సోలంకి చెప్పారు. సోమవారం కూడా ఎఫ్ఐఐలు రూ. 936 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. బ్రెంట్ క్రూడ్ బారెల్ 85.23 వద్ద ట్రేడవుతోంది.