- 356 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- బీజేపీ గెలవడంతో పశ్చిమ బెంగాల్ కంపెనీల షేర్లు జూమ్
- రూ.2,800 కోట్ల విలువైన షేర్లు కొన్న ఎఫ్ఐఐలు
ముంబై: మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఎన్నికల ఫలితాలు ఉండడంతో బెంచ్మార్క్ ఇండెక్స్లు సోమవారం లాభాల్లో కదిలాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఇంట్రాడేలో ఒక శాతం వరకు పెరిగాయి. కానీ, అమెరికా మిడిల్ ఈస్ట్లో వార్ షిప్ను మోహరించడంతో ఇండెక్స్లు తమ ఇంట్రాడే గరిష్టాల నుంచి పడ్డాయి. చివరికి సెన్సెక్స్ 356 పాయింట్ల (0.46 శాతం) లాభంతో 77,269.40 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 997 పాయింట్లు పెరిగి 77,910.75 వరకు చేరింది. నిఫ్టీ 122 పాయింట్లు పెరిగి 24,119.30 వద్ద స్థిరపడింది. బీజేపీ గెలవడంతో పశ్చిమ బెంగాల్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీల షేర్లు సోమవారం ర్యాలీ చేశాయి. శ్రీరామ్ ప్రాపర్టీస్ 8 శాతం, సీఈఎస్సీ (ఆర్పీ–సంజీవ్ గొయెంకా గ్రూప్ కంపెనీ) షేర్లు 6 శాతం, బంధన్ బ్యాంక్ 3.5 శాతం, ఆర్పీఎస్జీ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు 4 శాతం లాభపడ్డాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు, క్యూ4 ఫలితాలు మార్కెట్కు మద్దతు ఇచ్చాయని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. అయితే హార్మూజ్ను తిరిగి ఓపెన్ చేసేందుకు అమెరికా మొదలు పెట్టిన “ప్రాజెక్ట్ ఫ్రీడం’’తో అనిశ్చితి పెరిగిందన్నారు.
మోతీలాల్ ఓస్వాల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా మాట్లాడుతూ, బీజేపీ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించడం రాజకీయ స్థిరత్వానికి సంకేతమని అన్నారు. జీఎస్టీ కలెక్షన్ రికార్డు స్థాయిలో ఉండటం, ఏప్రిల్ ఆటో సేల్స్ డేటా బలంగా రావడంతో మార్కెట్ పెరిగిందని తెలిపారు. సెక్టార్ల వారీగా చూస్తే, సోమవారం రియల్టీ, సర్వీసెస్, క్యాపిటల్ గూడ్స్, ఇండస్ట్రియల్స్, హెల్త్కేర్, యుటిలిటీస్ ఇండెక్స్లు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. ఐటీ, పీఎస్యూ బ్యాంక్ నష్టపోయాయి. స్మాల్క్యాప్ 0.79శాతం, మిడ్క్యాప్ 0.75శాతం పెరిగాయి. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) శుక్రవారం రూ.8,047.86 కోట్ల విలువైన షేర్లు విక్రయించగా, సోమవారం రూ.2,800 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. డాలర్తో రూపాయి విలువ సోమవారం 39 పైసలు పడిపోయి రూ.95.23 వద్ద జీవిత కాల కనిష్టాన్ని నమోదు చేసింది.
