సియోల్: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న చో కుక్కు న్యాయశాఖ మంత్రి పదవి కట్టబెట్టడంపై సౌత్ కొరియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ప్రతిపక్షనేత హ్వాంగ్ క్యోహన్ బహిరంగంగా గుండు కొట్టించుకున్నారు. సోమవారం సాయంత్రం ప్రెసిడెన్షియల్ప్యాలెస్ ముందు తన మద్ధతుదారులు, జర్నలిస్టుల సమక్షంలో ఆయన ఇలా నిరసన తెలిపారు. చో కుక్ను వెంటనే పదవిలో నుంచి తొలగించాలని హ్వాంగ్ డిమాండ్ చేశారు. ఇదే విషయంపై పోయిన వారం ఇద్దరు మహిళా ఎంపీలు కూడా ఇలాగే నిరసన తెలిపారు.
ఎవరీ చో కుక్
వృత్తిరీత్యా కుక్ లా ప్రొఫెసర్.. ప్రెసిడెంట్ మూన్ జేయిన్అసిస్టెంట్. వారం క్రితమే మంత్రి పదవి స్వీకరించారు. అకడమిక్ ఫ్రాడ్ సహా పలు ఆర్థిక నేరాలలో కుక్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలను లెక్కచేయకుండా కుక్ కు మంత్రి పదవి కట్టబెట్టడం విమర్శలకు దారితీసింది. యూనివర్సిటీలో తన కూతురుకు సీటు ఇప్పించేందుకు కుక్ భార్య ఫోర్జరీకి పాల్పడ్డారని వర్సిటీ స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై కుక్ విచారం వ్యక్తంచేశారు. కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నారనే కారణంతో కుక్ను దూరంపెట్టడం సరికాదని ప్రెసిడెంట్మూన్జేయిన్ అన్నారు.
గుండుతో నిరసన వెనక..
సౌత్ కొరియాలో నిరసన తెలపడానికి, దానిపై కమిట్మెంట్ చెప్పడానికి గుండు కొట్టించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. చైనా ఫిలాసఫర్ కన్ఫ్యూషియన్ కాలంలో మొదలైన ఈ నిరసన ఇప్పటికీ కొనసాగుతోంది. సైనిక నియంతృత్వ పాలనలో అసమ్మతివాదులు, ఆ తర్వాత ఉద్యమకారులు, రాజకీయ నేతలు దీనిని ఫాలో అవుతున్నారు. 2018 లో పబ్లిక్ టాయిలెట్లలో సీక్రెట్ కెమెరాలను ఏర్పాటు చేసిన ఘటనలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. దీనిపై పలువురు మహిళలు గుండ్లతో నిరసన తెలిపారు. అంతకుముందు అమెరికా యాంటీ మిస్సైల్ సిస్టమ్కు వ్యతిరేకంగా 900 మంది కొరియన్లు గుండు కొట్టించుకున్నారు. ఇచెయాన్ సిటీకి దగ్గర్లో కొత్త ఇండస్ట్రియల్ ప్లాంట్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ సిటీ ప్రజలు వందలాదిగా గుండు కొట్టించుకున్నారు.
