ఇంట్లో పైసలు దాపెడితే.. ఎక్కడ పెట్టారో భార్యకు చెప్పండయ్యా.. లేకపోతే ఇట్లనే అయితది..!

ఇంట్లో పైసలు దాపెడితే.. ఎక్కడ పెట్టారో భార్యకు చెప్పండయ్యా.. లేకపోతే ఇట్లనే అయితది..!

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భర్త దాచిన సొమ్మును భార్య తెలియకుండా పోగొట్టేసింది. అనుకోకుండా జరిగినా.. పోయిన సొమ్ము పెద్ద మొత్తం కావడంతో స్థానికంగా ఈ విషయం గురించి చర్చించుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్‌కు చెందిన రైతు పోతరాజు వీరయ్య ఇటీవల తన ఎడ్లను విక్రయించాడు. వచ్చిన లక్షన్నర (రూ. 1,50,000) డబ్బును దొంగల భయానికో.. లేదో మరోటో కాని.. వడ్ల బస్తాలో దాచి ఉంచాడు. ఈ విషయం ఇంట్లో చెప్పలేదు. ఈ క్రమంలో వీరయ్య పని మీద పొలం వద్దకు వెళ్లాడు.

ఆ సమయంలోనే ధాన్యం, చింతగింజలు కొనుగోలు చేసే వ్యాపారి ఊళ్లోకి వచ్చాడు. దీంతో వీరయ్య భార్య.. తన ఇంట్లో ఉన్న వడ్లను అతడికి విక్రయించింది. కాసేపటి తర్వాత పొలం పనులు ముగించుకొని వీరయ్య ఇంటికి వచ్చాడు. ఇంట్లో చూడగా ధాన్యం బస్తా కనిపించలేదు. తీవ్ర ఆందోళనకు గురైన ఆయన బస్తా ఏమైందని భార్యను అడిగాడు. ఊళ్లోకి వడ్లు కొనేవాళ్లు వస్తే అమ్మేశానని చెప్పింది.

ALSO READ | అమీన్‌పూర్‌లో దారుణం.. కారు నేర్చుకుంటూ ఇద్దరు చిన్నారుల పైకి ఎక్కించేసిన యువతి

దీంతో భార్యకు అసలు విషయం చెప్పగా.. ఇద్దరూ లబోదిబోమన్నారు. వెంటనే ఆ వ్యాపారి కోసం గాలించగా.. ఎక్కడా అతని ఆచూకీ లభించలేదు. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ పోలీస్ స్టేషన్కు పరుగు తీశారు. జరిగిన విషయం చెప్పి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి వాహనాన్ని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.