సింగరేణిలో స్ట్రక్చరల్ ​మీటింగ్​లు బంద్

సింగరేణిలో స్ట్రక్చరల్ ​మీటింగ్​లు బంద్
  • జీఎంలను ఆదేశించిన యాజమాన్యం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కార్మిక సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో నిర్వహించే స్ట్రక్చరల్ మీటింగ్​లను సింగరేణి యాజమాన్యం బంద్​ పెట్టింది. సింగరేణి వ్యాప్తంగా నెలకొన్న ప్రధాన సమస్యలను యాజమాన్యంతో చర్చించి పరిష్కరించుకునేందుకు వీలుగా యాజమాన్యం మూడు నెలలకోసారి కంపెనీ చైర్మన్, మేనేజింగ్​డైరెక్టర్​స్థాయిలో గుర్తింపు సంఘంతో స్ట్రక్చరల్​మీటింగ్​నిర్వహిస్తుంది. ఇదే క్రమంలో డైరెక్టర్​పా ఆధ్వర్యంలో రెండు నెలలకోసారి నిర్మాణాత్మక మీటింగ్​ను గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల ప్రతినిధులతో యాజమాన్యం చేపడ్తుంది. కొవిడ్, గుర్తింపు సంఘం కాలపరిమితి గొడవల పేర యాజమాన్యం స్ట్రక్చరల్​మీటింగ్​లను వాయిదా వేస్తూ వస్తోంది.

ఇప్పుడేమో గుర్తింపు సంఘం ఎన్నికలయ్యేంత వరకు స్ట్రక్చరల్​మీటింగ్​లు పెట్టవద్దంటూ యాజమాన్యం అనధికారికంగా జీఎంలకు ఆదేశాలివ్వడం గమనార్హం. కార్మికుల సమస్యలపై యాజమాన్యంతో చర్చించాలంటే స్ట్రక్చరల్​ మీటింగ్​లోనే సాధ్యమవుతుంది. స్ట్రక్చరల్​ మీటింగ్​లో మాట్లాడిన ప్రతి విషయం రికార్డు అవుతుంది. దీంతో ఆ సమస్య పరిష్కారం కాకపోతే మరోసారి మీటింగ్​లో యూనియన్​ ప్రతినిధులు యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తారు. డైరెక్టర్​ పా, ఏరియాల లెవెల్​లో చాలా సమస్యలున్నాయని గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. స్ట్రక్చరల్​ సమావేశాలు లేకపోవడంతో చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోలేని పరిస్థితి ఏర్పడిందని యూనియన్ల లీడర్లు వాపోతున్నారు. నిన్న మొన్నటివరకు కొవిడ్​పేరు చెప్పి మీటింగ్​లు పెట్టకుండా తప్పించుకున్న యాజమాన్యం, ఇప్పుడేమో ఎన్నికల పేరు చెప్తూ స్ట్రక్చరల్​మీటింగ్​లను పెట్టకపోవడం దారుణమని గుర్తింపుసంఘమైన టీబీజీకేఎస్​ లీడర్లు ఆరోపిస్తున్నారు. 
మీటింగ్​లు పెడ్తాం
కొవిడ్ ​నేపథ్యంలో స్ట్రక్చరల్​ మీటింగ్​లు ఏర్పాటు చేయడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే. త్వరలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలతో స్ట్రక్చరల్​ మీటింగ్​లు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. మీటింగ్​లు లేకపోయినా గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సమస్యలను మా దృష్టికి తీసుకువస్తున్నారు. వీలున్నమేర సమస్యల పరిష్కారానికి యాజమాన్యం కృషి చేస్తోంది. -ఎన్. బలరాం, డైరెక్టర్​పా, సింగరేణి 
సింగరేణి లెవల్ ​స్పోర్ట్స్ ​పోటీలు షురూ
మందమర్రి, వెలుగు: వర్క్​పీపుల్ స్పోర్ట్స్​అండ్ గేమ్స్​అసోసియేషన్​ ఆధ్వర్యంలో  సింగరేణి కంపెనీ లెవల్​షటిల్ బాడ్మింటన్, టేబుల్ ​టెన్నిస్​ పోటీలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని సీఈఆర్​ క్లబ్​లో పోటీలను మందమర్రి ఏరియా సింగరేణి జీఎం చింతల శ్రీనివాస్​ లాంఛనంగా ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో రాణించి కోలిండియాలో సింగరేణి క్రీడాకారులు ప్రతిభ చూపాలన్నారు. టేబుల్​టెన్నిస్​ సింగిల్స్​ విభాగంలో బెల్లంపల్లి రీజియన్​  శ్రీరాంపూర్​ఏరియా క్వాలిటీ విభాగం ఆఫీస్​ సూపరిండెంటెంట్​ఎం.వెంకటేశ్వర్​రావు, ఆర్కే5 గని మైనింగ్​ సర్దార్​కట్ట ఈశ్వరాచారి, మందమర్రి ఏరియా కాసీపేట 2 గని మైనింగ్​సర్దార్​ పిల్లి వెంకటేశ్వర్లు, భూపాలపల్లి ఏరియా సీనియర్​ సూపరింటెండెంట్​ఎ.శ్రీనివాస్ సెమీస్​కు చేరారు.

విమెన్స్​ షటిల్​ బాడ్మింటన్​లో ఆర్జీ1 సింగరేణి ఏరియా ఆసుపత్రి స్టాఫ్​నర్స్​కె.స్వరూప ఫైనల్​కు చేరింది. కొత్తగూడెం మెయిన్​ ఆసుపత్రి సింగరేణి డాక్టర్​ శైలజ, ఆర్జీ1 ఏరియా సింగరేణి ఏరియా ఆసుపత్రి స్టాఫ్​నర్స్​చలం కుమారి సెమీస్​కు చేరారు. షటిల్​ బాడ్మింటన్​ వెటరన్​ విభాగంలో జనరల్​ మజ్దూర్​ బాబర్​పాషా(కొత్తగూడెం ఏరియా),  అసిస్టెంట్​ చైన్​మెన్​ టి.శంకర్, సెక్యూరిటీ గార్డు పి.సారంగపాణి​(భూపాలపల్లి),  డాక్టర్​ విజయ్​కుమార్​ (కొత్తగూడెం మెయిన్​ ఆసుపత్రి) సెమీస్​ చేరారు.