- హనుమకొండ జిల్లాలో గురుకుల స్టూడెంట్స్ ఆందోళన
- మంచి భోజనం పెట్టడం లేదని పాఠశాల ముందు ధర్నా
- తినలేక ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ఆవేదన
గురుకుల స్కూల్లో భోజనం సరిగా పెట్టడం లేదని హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలో స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. ‘‘మేము తినే అన్నం బర్లు కూడా తినడంలేదు” అని స్కూల్ ఆవరణలో బర్లకు పెడుతూ నిరసన తెలిపారు. ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ధర్నాకు దిగారు.
ధర్మసాగర్, వెలుగు: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురంలోని జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ స్కూల్లో మంచి భోజనం పెట్టడం లేదని స్టూడెంట్స్ఆందోళన చేపట్టారు. ‘‘మేము తినే అన్నం బర్లు కూడా తినడం లేదు” అని స్కూల్ ఆవరణలో ఉన్న బర్లకు పెడుతూ నిరసన తెలిపారు. గురువారం స్కూల్ ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఉదయం నుంచి స్టూడెంట్స్ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. సంఘటనా స్థలానికి మీడియా చేరుకోగానే పాఠశాల యాజమాన్యం వచ్చి స్టూడెంట్స్ను ధర్నా విరమించాలని కోరారు. అందుకు వారు ఒప్పుకోలేదు. తమకు న్యాయం కావాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ.. భోజనం మెనూ ఫాలో కావడం లేదని తెలిపారు. అన్నం ముద్దగా ఉంటుందని, జీరా రైస్ లో నీళ్లు ఉంటున్నాయని వాపోయారు. తినలేక ఖాళీ కడుపుతో పడుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
మంచినీటి సౌకర్యం లేక ట్యాంక్ వాటర్ తాగుతున్నామన్నారు. స్కూల్లో ఏ స్విచ్ బోర్డు పగిలినా తమ కాస్మోటిక్ బిల్లుల్లోనే కట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పై అధికారులకు కంప్లైంట్ చేస్తే వాళ్లని టార్గెట్ చేసి కొడుతున్నారని చెప్పారు. ఫెసిలిటీస్ గురించి ఎవరైనా ప్రశ్నిస్తే వారి తల్లిదండ్రులను పిలిచి బెదిరిస్తున్నారని అన్నారు. బాత్రూం పైపులు లీకై దుర్వాసన వస్తోందని, ఆ వాసనను భరించలేకపోతున్నామని తెలిపారు. పాఠశాల ముందుభాగం చెత్తాచెదారంతో నిండిపోయిందని.. పైఅధికారులకు చెప్పినా స్పందిస్తలేరని అన్నారు. ఈ సమస్యపై ప్రిన్సిపల్ మల్లయ్యను వివరణ కోరగా మెనూ ప్రకారం అన్నీ పెడుతున్నామని, ఈ రోజు వంటమనిషి రాకపోవడంతో ఇడ్లీకి బదులు జీరా రైస్ పెట్టామని, అది సరిగా లేదని స్టూడెంట్స్ ధర్నాకు దిగారని అన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్.. ధర్మసాగర్ తహసీల్దార్ రజినిని హాస్టల్కు వెళ్లి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.