
- రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది: సీఎం రేవంత్
- అసమానతలు లేని సమాజ స్థాపనే లక్ష్యం
- పదేండ్లలో నిరుద్యోగులను బీఆర్ఎస్ నిండా ముంచింది
- మేం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే వాళ్లు అడ్డుపడ్తున్నరు
- విద్యారంగంలో సమూల మార్పులు చేస్తున్నం
- ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందిస్తమని వెల్లడి
- గురుకుల విద్యార్థులకు బహుమతులప్రదానోత్సవానికి హాజరు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఏడాదిన్నర కాలంలోనే ప్రైవేట్, కార్పొరేట్ సెక్టార్లలో పెట్టుబడులు తెచ్చి లక్ష ఉద్యోగాలు సృష్టించామని.. ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ తెచ్చుకున్నామో వాటి సాకారం కోసం తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. కులం ఆధారంగా గుర్తింపు రాదని.. చదువు ద్వారానే గౌరవం, ఉన్నత స్థానాలు సాధించవచ్చని విద్యార్థులకు ఆయన సూచించారు. “15 నుంచి 25 ఏండ్ల వయసు అత్యంత కీలకమైంది. ఈ సమయంలో నిబద్ధతతో చదువుకుంటే.. జీవితంలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్, ఐపీఎస్లు, ప్రజాప్రతినిధులుగా గౌరవప్రదమైన స్థానం సాధించవచ్చు. తప్పుదారి పడితే జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది” అని పేర్కొన్నారు.
“మీరు రాణిస్తే రాష్ట్రం, దేశం గర్విస్తాయి. మీ విజయం కోసం ప్రభుత్వం అండగా ఉంటుంది” అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేసిందన్నారు. “గత పదేండ్లలో బర్రెలు, గొర్రెలు, చేపల స్కీములు ఇచ్చారు తప్ప.. చదువు, ఉద్యోగాలు, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇస్తామని చెప్పలేదు. పదేండ్లలో గ్రూప్-1 వంటి పోటీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను ముంచింది” అని మండిపడ్డారు. ఇప్పుడు తాము ఉద్యోగాల భర్తీ చేపడ్తుంటే.. అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ‘‘నోటికాడికొచ్చిన ముద్దను కిందపడేస్తే.. ఆ తల్లిదండ్రుల బాధ ఎట్ట ఉంటుందో ఆలోచించండి” అని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్ బంజారాహిల్స్లోని బాబూ జగ్జీవన్ రామ్ భవన్లో జరిగిన గురుకుల విద్యార్థుల బహుమతుల ప్రదానోత్సవంతో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. టెన్త్, ఐఐటీ, నీట్, స్పోర్ట్స్లో రాణించిన విద్యార్థులను సన్మానించారు.
కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, విప్ లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదిరులు పాల్గొన్నారు. తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 129వ వర్ధంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని సీఎం రేవంత్రెడ్డి గుర్తుచేశారు. నిజాం హయాంలో ప్రజల్లో చైతన్యం తెచ్చారని పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. మీరు కష్టపడి చదువుకుంటే, రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుంది” అని విద్యార్థులతో సీఎం అన్నారు.
విద్యారంగంలో సమూల మార్పులు
విద్యా రంగంలో సమూల సంస్కరణలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని సీఎం తెలిపారు. సివిల్స్ కోచింగ్ కోసం సింగరేణి సంస్థ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని.. దీని ఫలితంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ
విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లుగా ఎంపిక అవుతున్నారని అన్నారు. పదేండ్లు నిరుద్యోగులను గత బీఆర్ఎస్ సర్కార్ ముంచిందని.. పీజీ, పీహెచ్డీ చదివిన యువత ఉద్యోగాల కోసం అల్లాడినా గ్రూప్-1 పరీక్షలు నిర్వహించలేదన్నారు. దీంతో యువత జీవితాలు కాల గర్భంలో కలిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గ్రూప్-1 పరీక్షల్లో 563 మంది స్టేట్ లెవెల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైనా.. కోర్టు కేసుల వల్ల నియామక పత్రాలు అందడం ఆలస్యమవుతున్నదన్నారు.
అసమానతలు తొలగించేందుకు కృషి
సమాజంలో అసమానతలను తొలగించి సమ సమాజ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఈ దిశగా తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు, కోఠిలోని మహిళా యూనివర్సిటీకి వీరవనిత చాకలి ఐలమ్మ పేరు, టెక్స్ టైల్ కాలేజీకి తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ నిర్ణయాలు తెలంగాణ స్ఫూర్తిని, పోరాట చరిత్రను గౌరవించేలా ఉన్నాయన్నారు.
ఉస్మానియా వర్సిటీ 100 ఏండ్ల చరిత్రలో మొదటిసారిగా దళితుడిని వైస్ చాన్స్లర్గా నియమించుకున్నామని.. అంబేద్కర్ యూనివర్సిటీకి ప్రొఫెసర్ చక్రపాణి, రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీకి గోవర్ధన్, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్కు ప్రొఫెసర్ పురుషోత్తం, విద్యా కమిషన్కు రిటైర్డ్ ఐఏఎస్ మురళిని నియమించుకున్నామని వివరించారు. దళితుడైన నాగేశ్వరరావును పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడం ద్వారా సమాజంలో అణచివేతకు గురైన వర్గాలకు ఉన్నత స్థానాల్లో అవకాశాలు కల్పించామని ఆయన తెలిపారు.
భవిష్యత్లో మరిన్ని కార్యక్రమాలు: భట్టి
సామాజిక తెలంగాణ నిర్మాణం, ప్రజల ఆత్మగౌరవ జీవనం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని, ఆ ఆకాంక్షల సాధనకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర ఆదాయం, ఖర్చులను బేరీజు వేసుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు తీసుకొస్తామన్నారు. ఈ ప్రభుత్వం ప్రజలకు అంకితమని.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను తూచా తప్పకుండా ఆయా వర్గాల కోసం ఖర్చు చేస్తున్నామని, గత ప్రభుత్వంలో ఖర్చు కాని రూ.13,223 కోట్ల ఎస్సీ సబ్ ప్లాన్, 1,296 కోట్ల ఎస్టీ సబ్ప్లాన్ నిధులను సీఎం రేవంత్ రెడ్డి క్యారీ ఫార్వర్డ్ చేశారని భట్టి వివరించారు.
ఈ ఏడాది ఎస్సీ సబ్ప్లాన్కు రూ. 40,232 కోట్లు, ఎస్టీ సబ్ప్లాన్కు రూ.17,169 కోట్లు కేటాయించామన్నారు. గత ప్రభుత్వం సబ్ప్లాన్ నిధులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని.. రాష్ట్ర బిడ్డలు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శకులుగా ఎదగాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షిస్తున్నారని ఆయన తెలిపారు. గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లకు సరైన భవనాలు లేక, ఫంక్షన్ హాళ్లలో, రైస్ మిల్లుల్లో నడిచాయని.. ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్కూళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు.
కార్పొరేట్ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లలో విద్య
రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను 25 ఎకరాల విస్తీర్ణంలో రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నామని.. ఇవి కార్పొరేట్ కాలేజీలతో పోటీపడే అంతర్జాతీయ స్థాయి విద్యను అందిస్తాయని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఈ స్కూళ్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు సమన్వయ విద్యను అందించి, సామాజిక ఐక్యతను పెంపొందిస్తాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 59 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందించినట్లు తెలిపారు.
“దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఒక సంవత్సరంలో ఇంతమందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇది మా చాలెంజ్” అని స్పష్టం చేశారు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉంది. కష్టపడి చదువుకుంటే, రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం మీకు లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీల్లో కూడా దాదాపుగా ఈ ఏడాదిన్నరలో లక్ష ఉద్యోగాలు కల్పించామని, లెక్కగట్టి పెట్టుబడులు తెచ్చి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు అందించామని, కానీ ఇవి సరిపోవని తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 20 లక్షల మంది నిరుద్యోగులు నమోదై ఉన్నారని, వీరందరికీ పోటీ పరీక్షల ద్వారా అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4 పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి, ఫలితాలను వెంటనే ప్రకటిస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో 29,533 ప్రభుత్వ పాఠశాలల్లో 26,41,536 మంది విద్యార్థులు చదువుతుండగా.. 11,217 ప్రైవేట్ స్కూళ్లలో 36,87,752 మంది చదువుతున్నారని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలపై పేదలకు పూర్తి విశ్వాసం కలిగేలా నాణ్యతను పెంచా ల్సిన అవసరం ఉందని.. కస్తూర్బా, అంగన్వాడీ, రెసిడెన్షియల్ స్కూళ్లలో పునాదులను బలోపేతం చేస్తామన్నారు. మేం ఉద్యోగాలు భర్తీ చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడ్తున్నది. నోటికాడికొచ్చిన ముద్దను కిందపడేస్తే.. ఆ బాధ ఎట్ల ఉంటదో ఆలోచించండి.