- స్టూడెంట్ యూనియన్ల పిలుపు
హైదరాబాద్, వెలుగు: విద్యా రంగంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు (ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐఎఫ్ డీఎస్, ఏఐఎస్బీ, ఏఐపీఎస్యూ) బుధవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై నెలరోజులు కావొస్తున్నా ఇప్పటికీ స్కూళ్లల్లో విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ అందలేదని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మూర్తి, నాగరాజు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ చెప్పారు.
ఇంటర్పుస్తకాల ప్రింటింగ్ కూడా పూర్తి కాలేదన్నారు. స్కూళ్లల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాగా, విద్యాసంస్థల బంద్కు ప్రైవేటు స్కూల్ మేనేజ్మెంట్ల సంఘం(ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్రావుతో పాటు యువజన సంఘాల నేతలు మద్దతు ప్రకటించారు.