
ఆదిలాబాద్, వెలుగు: ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న ఎరువులను అక్రమంగా మహారాష్ట్రకు తరలిస్తున్న వాహనాలను మంగళవారం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వరంగ సంస్థ హాకాలో పని చేస్తున్న ప్రొప్రైటర్ సునీల్, ఉద్యోగి అజయ్ మహారాష్ట్రలోని మాతార్జున్ గ్రామంలోని ఫర్టిలైజర్ షాప్ ఓనర్ నిఖిల్ తో కుమ్మక్కై యూరియాను తరలించేందుకు ప్లాన్ చేశారు.
మంగళవారం బేల మండలకేంద్రంలోని హాకా సెంటర్ నుంచి రూ.3 లక్షల విలువ చేసే 150 బ్యాగుల యూరియాను వాహనాల్లో తరలిస్తుండగా, ఈ విషయాన్ని రైతులు పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన జైనథ్ సీఐ డి సాయినాథ్, బేల ఎస్సై నాగ్నాథ్ సిబ్బందితో కలిసి దాడి చేసి యూరియాను స్వాధీనం చేసుకున్నారు. హాకా సెంటర్ నిర్వాహకులు సునీల్, అజయ్, మహారాష్ట్రకు చెందిన ఫర్టిలైజర్ షాప్ ఓనర్ నిఖిల్, వాహనాల డ్రైవర్లు వాకంటే దిలీప్, చలికలవార్ చంద్రశేఖర్పై కేసు నమోదు చేశారు. యూరియాను పట్టుకున్న సీఐ, ఎస్సైలను డీఎస్పీ అభినందించారు.