న్యూఢిల్లీ: ఇండియాలో వాడకుండా పడివున్న విమానాశ్రయాలకు విమానాలు నడిపే కంపెనీలకు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఉడాన్ (ఉడే దేశ్ కే ఆమ్ నగరిక్) స్కీమ్లో భాగంగానే సబ్సిడీ ఉంటుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. ఇప్పటికే భారీగా ఖర్చు చేసి కట్టిన చాలా ఎయిర్పోర్టుల్లో ప్రయాణికులు కనిపించడం లేదు.
ఇలాంటి ఎయిర్పోర్టులను పరిగణనలోకి తీసుకోనున్నారు. కొన్ని నిర్ధిష్టమైన రూట్లలో తక్కువ టికెట్ ధరకు విమానాలు నడిపే కంపెనీలకు నెలవారీ సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుందని సంబంధిత వ్యక్తులు అన్నారు. 2016లో ప్రారంభమైన ఉడాన్ ద్వారా ఇప్పటివరకు 649 కొత్త రూట్లు, 93 విమానాశ్రయాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ప్రారంభమైన అజమ్గఢ్, ముజఫర్పూర్ వంటి విమానాశ్రయాల్లో ప్రయాణికులు పెద్దగా లేరు. దీంతో ఇలాంటి ఎయిర్పోర్టులను వాడకంలోకి తేవాలని కేంద్రం చూస్తోంది.
