- రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
తంగళ్లపల్లి, వెలుగు: ఓ యువకుడు ఫేస్బుక్లైవ్పెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సోమవారం సిరిసిల్ల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఫేస్బుక్లైవ్వీడియో ప్రకారం.. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్కు చెందిన గొడిసెల దిలీప్(23), చింతలఠాణా గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. యువతి అనారోగ్యానికి గురైనప్పుడు దిలీప్ రూ.3లక్షల వరకు ఖర్చు చేశాడు. తర్వాత యువతి తల్లిని కలిసి ప్రేమ విషయం చెప్పాడు. కులం ఏమిటో అడిగిన యువతి తల్లి దిలీప్ను కులం పేరుతో దూషించింది. తర్వాత యువతి కుటుంబ సభ్యులు, చింతలఠాణాకు చెందిన కొందరు పెద్ద మనుషులు దిలీప్పై సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సిరిసిల్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ అనిల్.. దిలీప్ ఇంటికి వెళ్లి యువకుడి మొబైల్లో యువతితో కలిసి దిగిన ఫొటోలను డిలీట్చేయించారు. తర్వాత దిలీప్పై కేసు ఫైల్ చేసి అరెస్టు చేశారు. బెయిల్పై బయటికి వచ్చిన దిలీప్ సోమవారం ఫేస్బుక్లైవ్ పెట్టి తనపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయాడు. సీఐ అనిల్ కుమార్ వేధింపులతోపాటు తనపై తప్పుడు కేసులు పెట్టించిన వారి కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే సిరిసిల్ల తరలించారు. ఈ ఘటనపై సీఐ అనిల్ కుమార్ను వివరణ కోరగా యువతి, ఆమె కుటుంబ సభ్యులతో దిలీప్ దురుసుగా ప్రవర్తించాడని ఫిర్యాదు అందడంతో కేసు ఫైల్చేశామని చెప్పారు. అతన్ని కొట్టడం కానీ తిట్టడం కానీ చేయలేదని వివరించారు. దిలీప్ను స్టేషన్కు రమ్మని ఫోన్ చేయగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడని సీఐ తెలిపారు.