- జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు
- కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో దుబాయ్లో మూడు ఫ్లాట్లు కొన్నాడని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్కు ముడుపులు అందాయని మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2020లో ఫార్మా కాంట్రాక్టర్ నుంచి అందిన ముడుపులతో కేజ్రీవాల్ దుబాయ్లో మూడు ఫ్లాట్లను కొనుగోలు చేశారని సుఖేశ్ ఆరోపించారు. ఆ మూడు ఫ్లాట్లను సగం రేటుకే వారం రోజుల కింద సీఎం అత్యవసరంగా అమ్మకానికి పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తన తరఫు లాయర్ అనంత మాలిక్ ద్వారా సుఖేష్ మూడు పేజీల లేఖను రిలీజ్ చేశారు. ఆ ఫ్లాట్లను అమ్మేందుకు మనోజ్ జైన్ను కేజ్రీవాల్ ఆశ్రయించారని తెలిపారు. ఇప్పటికైనా కేజ్రీవాల్ ఆ ఫ్లాట్లపై నిజం చెప్పకపోతే, రానున్న ఏడు రోజుల్లో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి సత్యేంద్ర జైన్తో తాను చేసిన మూడు పేజీల చాట్ ను ఈడీ, యాంటీ కరెప్షన్ విభాగాలకు పంపుతానని ఆయన హెచ్చరించారు.