హైదరాబాద్ ఫార్మా కంపెనీ నుంచి..కేజ్రీవాల్​కు ముడుపులు

హైదరాబాద్ ఫార్మా కంపెనీ నుంచి..కేజ్రీవాల్​కు ముడుపులు
  •     జైలు నుంచి సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు
  •     కాంట్రాక్టర్  నుంచి అందిన ముడుపులతో దుబాయ్​లో మూడు ఫ్లాట్లు కొన్నాడని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ లోని ఫార్మా కాంట్రాక్టర్  నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్  కేజ్రీవాల్​కు ముడుపులు అందాయని మండోలి జైల్లో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. 2020లో ఫార్మా కాంట్రాక్టర్  నుంచి అందిన ముడుపులతో కేజ్రీవాల్ దుబాయ్​లో మూడు ఫ్లాట్లను కొనుగోలు చేశారని సుఖేశ్ ఆరోపించారు. ఆ మూడు ఫ్లాట్లను సగం రేటుకే వారం రోజుల కింద సీఎం అత్యవసరంగా అమ్మకానికి పెట్టారని ఆయన పేర్కొన్నారు. ఆదివారం తన తరఫు లాయర్  అనంత మాలిక్  ద్వారా సుఖేష్ మూడు పేజీల లేఖను రిలీజ్ చేశారు. ఆ ఫ్లాట్లను అమ్మేందుకు మనోజ్ జైన్​ను కేజ్రీవాల్ ఆశ్రయించారని తెలిపారు. ఇప్పటికైనా కేజ్రీవాల్  ఆ ఫ్లాట్లపై  నిజం చెప్పకపోతే, రానున్న ఏడు రోజుల్లో ఈ వ్యవహారంపై మాజీ మంత్రి సత్యేంద్ర జైన్​తో తాను చేసిన మూడు పేజీల చాట్ ను ఈడీ, యాంటీ కరెప్షన్ విభాగాలకు పంపుతానని ఆయన హెచ్చరించారు.