మార్చిలోనే మండుతున్నయ్

మార్చిలోనే మండుతున్నయ్
  •  ‘సూపర్​ ఎల్​నినో’ ఎఫెక్ట్​తో ఎండలు ముదురుతున్నయ్​
  • ఈ నెలంతా హీట్​వేవ్స్​ఉండొచ్చన్న ఐఎండీ
  • ఇప్పటికే రాష్ట్రంలో 39.3 డిగ్రీల టెంపరేచర్​ రికార్డ్​
  • నాలుగు రోజుల పాటు ఎల్లో అలర్ట్​ ఇచ్చిన వాతావరణ శాఖ
  • 2016 మార్చిలో 46.3 డిగ్రీల రికార్డ్​ టెంపరేచర్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో దాదాపు నెలరోజులు లేట్​గా ఎంటరైన వానాకాలం తొందరగా ముగిసిపోయింది. చలికాలమూ అతి తక్కువ టైమే ఉంది. అయితే,  ఎండాకాలం మాత్రం ‘సూపర్​ ఎల్​నినో’ ఎఫెక్ట్​తో తొందరగా వచ్చింది. మార్చి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం పది దాటగానే ఎండల తీవ్రత పెరిగిపోతున్నది. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలు దాటాయి. ఆదివారం అత్యధికంగా నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​లో 39.3 డిగ్రీల టెంపరేచర్​ నమోదైంది. మహబూబాబాద్​ జిల్లా గార్లలో 39.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. 

కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ములుగు, వరంగల్​ జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 38.5 డిగ్రీలపైనే రికార్డయ్యాయి. ఆ నాలుగు జిల్లాల్లో కూడా 37.5 నుంచి 38 డిగ్రీల మధ్యన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే నాలుగు రోజుల పాటు ఎండ మంట కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రం మొత్తానికి ఎల్లో అలర్ట్​లో జారీ చేసింది. ఈ నాలుగు రోజుల పాటు టెంపరేచర్లు 40 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. హైదరాబాద్​లోనూ ఆదివారం 38.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 

ఎర్లీ సమ్మర్​

మన రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఎండా కాలం తొందరగా వచ్చిందని ఐఎండీ (భారత వాతావరణ శాఖ) తెలిపింది. మామూలుగా అయితే మార్చి మూడో వారం నుంచి ఎండలు ముదురుతాయని, ఇప్పుడు మాత్రం మార్చి ఆరంభం నుంచే ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని ఐఎండీ  పేర్కొంది. మే నెల వరకు ఎండల ప్రభావం చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈనెల మొత్తం తెలంగాణతో పాటు మన పొరుగు రాష్ట్రాల్లోనూ హీట్​వేవ్స్​ ముప్పు ఉంటుందని పేర్కొంది. ఆయా రాష్ట్రాలను రెడ్​ జోన్​లో పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా మే వరకు  వడగాలుల ప్రభావం కొనసాగుతుందని వివరించింది.

రికార్డ్​ బ్రేక్​ చేస్తదా?

వాస్తవానికి 2016లో మార్చిలో రికార్డ్​ స్థాయిలో టెంపరేచర్లు నమోదయ్యాయి. ఆ ఏడాది రెండో వారంలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీలు రికార్డయ్యాయి. మూడో వారం నాటికి పీక్​ స్థాయికి వెళ్లాయి. ఆ ఏడాది మార్చి 23న మహబూబాబాద్​ జిల్లా బయ్యారంలో రికార్డు స్థాయిలో అత్యధికంగా 46.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటిదాకా మార్చిలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత ఇదేనని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా మార్చి తొలి వారం నుంచే ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ఆ రికార్డ్​ టెంపరేచర్​ను మించి ఉష్ణోగ్రత నమోదవుతుందా అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

సూపర్ ఎల్ నినో వల్లే ముదురుతున్న ఎండలు

మార్చి తొలి వారం నుంచే ఎండలు పెరగడానికి కారణం ‘సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్’ అని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఈ సూపర్​ ఎల్​నినో ఎఫెక్ట్​తోనే వర్షాల్లోనూ తేడాలు ఏర్పడ్డాయి. వానాకాలంలో కురవాల్సిన సగటు వర్షపాతం కన్నా ఎక్కువే నమోదైనా.. ఆ వర్షపాతమంతా కేవలం ఒక వారం పది రోజుల్లోనే రికార్డ్​ అయింది. అది కూడా కొన్ని ప్రాంతాల్లోనే నమోదైంది. ఇప్పుడు ఈ సూపర్​ ఎల్​నినో ప్రభావం కారణంగానే ఎండా కాలం త్వరగా ప్రారంభమైందని అంటున్నారు. వాస్తవానికి ఇండియా సహా వివిధ దేశాల్లో సూపర్​ ఎల్​నినో ప్రభావం ఉంటుందని నేషనల్​ ఓషియానిక్​ అట్మాస్ఫెరిక్​ అడ్మినిస్ట్రేషన్​ (ఎన్ఓఏఏ) నిరుడు అక్టోబరులోనే అంచనా వేసింది. 

పసిఫిక్​ సముద్రంలో నవంబర్, జనవరి మధ్య ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయని చెప్తున్నారు. చరిత్రలో ఆరుసార్లు మాత్రమే పసిఫిక్​లో టెంపరేచర్లు ఇలా నమోదయ్యాయని గుర్తుచేస్తున్నారు. దాని ప్రభావంతోనే ఇప్పుడు టెంపరేచర్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే ఎల్​నినో బలహీనపడుతున్నదని ఇటీవల ఎన్​వోఏఏ రిలీజ్​ చేసిన రిపోర్టులో  పేర్కొంది. ఏప్రిల్​ చివరి నాటికి లానినా పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, వచ్చే వర్షాకాలం నాటికి వర్షాలు సమృద్ధిగా కురిసే అవకాశం ఉందని పేర్కొంది.