
ధనాధన్ క్రికెట్కు వేళయింది. మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్ 2023 మొదలవనుంది. గతేడాది పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సారి కప్పు కొట్టాలని భావిస్తోంది. సొంత గడ్డపై సరికొత్తగా బరిలోకి దిగనుంది. ఆరెంజ్ ఆర్మీ ఈ సారి కొత్త కెప్టెన్ తో ..కొత్త టీమ్ లో ఆడబోతుంది.
సన్రైజర్స్ ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్తో జరిగే మ్యాచ్తో ఐపీఎల్ను ప్రారంభిస్తుంది. అయితే ఫస్ట్ మ్యాచ్ కు సౌతాఫ్రికా ప్లేయర్లు కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్, మార్కో జాన్సేన్, హెన్రిచ్ క్లాసేన్లు దూరం కానున్నారు. అయితే తొలి మ్యాచ్లో ఓపెనర్లుగా మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మలు బరిలోకి దిగే ఛాన్సుంది. మయాంక్ అగర్వాల్ను సన్రైజర్స్ జట్టు రూ.8.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పటికే అభిషేక్ శర్మ స్టైలిష్ బ్యాటింగ్తో నిరూపించుకున్నాడు.
అటు మిడిలార్డర్లో రాహుల్ త్రిపాఠీ,కెప్టెన్ మార్క్రమ్,హారీ బ్రూక్ ఆడతారు. వీరి కోసం రూ.13.25 కోట్లు ఖర్చు చేసింది. ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ సన్రైజర్స్ జట్టుకు అదనపు బలం. అతను బౌలింగ్ తో పాటు..బ్యాటింగ్ తోనూ అద్భుతాలు చేయగలడు. వీరికి తోడు హెన్రిచ్ క్లాసేన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో అద్భుతంగా ఆడాడు. ఈ టోర్నీలో మొత్తం 10 మ్యాచుల్లో 363 పరుగులు చేశాడు.
సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. ఉమ్రాన్ మాలిక్,అదిల్ రషీద్ ఇద్దరు మంచి బౌలర్లు. ముఖ్యంగా ఉమ్రాన్ గతేడాది ఐపీఎల్ 2022 ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. దీంతో అతను టీమిండియాలోనే చోటు దక్కించుకున్నాడు.
గత రెండు ఐపీఎల్ సీజన్లలో అభిమానులను నిరాశపర్చిన సన్ రైజర్స్పై ఈ సారి భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారైనా కప్పు కొట్టాలని అభిమానులు ఎంతో ఆశపడుతున్నారు. మరి అభిమానుల ఆశలను సన్ రైజర్స్ హైదరాబాద్ ఏ మేరకు నెరవేరుస్తుందో చూడాలి