సాహసం ఆయన మార్గం.. ధైర్యం ఆయన సిద్ధాంతం.. కొత్తదనం ఆయన నమ్మే సూత్రం.. ప్రయోగాలు ఆయన కెరీర్లో మైలు రాళ్లు..
సాహసాలను ఇంటిపేరుగా మార్చుకుని, ఇండస్ట్రీని ప్రయోగశాలగా మార్చి నూతన శకానికి నాంది పలుకుతూ ఏ కంఠమైతే.. సంచలనాలకు మారుపేరుగా నిలిచిందో.. ఏ నవ్వు అయితే కొన్నేళ్ల పాటు తెలుగు తెరను ఏలిందో, ఎవరి కటౌట్ కనిపిస్తే ప్రేక్షకులు పరుగు పరుగున థియేటర్స్కు పరుగెత్తేవారో.. ఆ సూపర్ స్టార్ కృష్ణ కోట్లాది ప్రేక్షకులకు దూరంగా ‘ఆకాశంలో ఒక తార’గా వెలిగేందుకు వెళ్లిపోయారు. నటుడిగానే కాక మంచి వ్యక్తిగానూ అందరి మనసుల్లో నిలిచిన నటశేఖరుడికి ఇది ‘వెలుగు’ నివాళి.
మూస ధోరణిలో వెళుతున్న సినీ పరిశ్రమను కొత్త దారుల్లో నడిపించారు కృష్ణ. అప్పటివరకూ తెలుగు సినిమాలంటే సాంఘిక చిత్రాలు, పౌరాణికాలు, జానపదాలే. ఇవి మాత్రమే సినిమాలు కావంటూ జేమ్స్ బాండ్, కౌబాయ్ లాంటి కొత్త తరహా కంటెంట్తో ప్రయోగాలు చేసి తనను తాను హీరోగా నిలబెట్టుకున్నారు. కమర్షియల్ కంటెంట్ లేదన్న ‘అల్లూరి సీతారామరాజు’ కథతోనూ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ట్రెండ్ ఫాలో అయ్యేవారే ఎక్కువగా ఉన్న ఇండస్ట్రీ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచారు కృష్ణ.
బుర్రిపాలెం బుల్లోడు
గుంటూరు జిల్లా బుర్రిపాలెం కృష్ణ స్వగ్రామం. 1943 మే 31న తెనాలిలో పుట్టారు. తండ్రి పేరు ఘట్టమనేని రాఘవయ్య చౌదరి, తల్లి నాగరత్నమ్మ. కృష్ణ తల్లిదండ్రులకు ఐదుగురు సంతానం. అందరిలో కృష్ణ పెద్దవారు. నిర్మాతలు హనుమంతరావు, ఆదిశేషగిరి రావు ఆయనకు తమ్ముళ్లు. పదో తరగతి వరకూ తెనాలిలో, ఇంటర్మీడియట్, డిగ్రీ ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో చదివారు. స్కూల్ డేస్లో ‘పాతాళ భైరవి’ చూసి ఎన్టీఆర్కు ఫ్యాన్గా మారిన కృష్ణ, కాలేజీ రోజుల్లో ఓ ఫంక్షన్కు ఏఎన్నార్ వచ్చినప్పుడు ఆయన క్రేజ్ చూసి సినిమాల్లోకి రావాలని ఫిక్స్ అయ్యారు.
‘తేనె మనసులు’తో మొదలు..
బీఎస్సీ పూర్తిచేశాక తనకు సినిమాలపై ఉన్న ఇష్టాన్ని తండ్రికి తెలియజేశారు. కొడుకు ఇష్టాన్ని ప్రోత్సహించడంతో రెండు సిఫారసు లెటర్స్ కూడా ఇచ్చి మద్రాసు పంపారు తండ్రి. కానీ అప్పటికి కృష్ణ వయసు 19 ఏళ్లే కావడంతో అనుభవం కోసం కొన్నాళ్లు నాటకాలు వేయమని ఎన్టీఆర్, ఎల్వీ ప్రసాద్ సలహాలు ఇచ్చారు. వారి సలహాలు పాటిస్తూ.. పాపం కాశీకి వెళ్లినా, ఛైర్మన్ లాంటి నాటకాలు వేసి తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ‘కొడుకులు కోడళ్లు’లో ఎల్వీ ప్రసాద్ అవకాశం ఇచ్చినా, నెలరోజుల రిహార్సల్స్ తర్వాత సినిమా ఆగిపోయింది. తిరిగి తెనాలి వచ్చేసిన కృష్ణను ‘తేనె మనసులు’కు కొత్త నటీనటులు కావాలి అనే ప్రకటన ఆకర్షించింది. ఫొటోలు, ఆడిషన్, మేకప్, స్క్రీన్ టెస్ట్ లాంటివన్నీ చేసి కృష్ణను ఎంపిక చేశారు. 1965 మార్చి 31న విడుదలైన ఆ సినిమా వంద రోజులు ఆడింది.
5 ఏళ్లలో 50కి పైగా
‘తేనె మనసులు’ తర్వాత అదే బ్యానర్లో ‘కన్నె మనసులు’ స్టార్ట్ అవుతున్న సమయంలో ‘గూఢచారి 116’లో అవకాశం వచ్చింది. ఒకే సమయంలో షూటింగ్ జరిగిన ఈ రెండు సినిమాలు రెండు వారాల గ్యాప్తో విడుదలయ్యాయి. ‘కన్నె మనసులు’ యావరేజ్గా ఆడితే ‘గూఢచారి 116’ సూపర్ సక్సెస్ సాధించి, మాస్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఓవర్ నైట్ స్టార్డమ్ వచ్చేసింది. వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇదే కదా కష్టపడాల్సిన సమయం అని బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. బాపు డైరెక్షన్లో వచ్చిన ‘సాక్షి’లో మొదటిసారి విజయ నిర్మలతో కలిసి నటించారు కృష్ణ. ఈ సినిమాకు డబ్బు కంటే పేరు ఎక్కువ వచ్చింది. ‘మాస్కో ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రదర్శించబడింది. ఏడో సినిమాకే ఎన్టీఆర్తో కలిసి ‘స్త్రీజన్మ’లో నటించారు. కంటిన్యూగా సినిమాలు చేస్తూ పగలు, రాత్రి అనే తేడాలేకుండా రోజుకు మూడు షిఫ్టుల చొప్పున వర్క్ చేసేవారు. అలసిపోయి నిద్రపోతుంటే కూడా నిద్రపోతున్న సీన్స్ తీస్తామన్న సందర్భాలు ఉన్నాయి. 1967లో ఏడు, 68లో పదకొండు, 69లో పదిహేను, 70లో పదిహేను చిత్రాలు చేశారు. దాంతో కెరీర్ మొదలైన ఐదేళ్లలోనే యాభై చిత్రాల మార్క్ దాటేశారు.
అల్లూరి సెన్సేషన్
ఎన్టీఆర్ కోసం తయారు చేయించిన ‘అల్లూరి సీతారామరాజు’ స్క్రిప్ట్ కృష్ణకు చేరడంతో, తన సొంత సంస్థలోనే ఆ సినిమాను నిర్మించారు. కమర్షియల్ సినిమాకు పనికొచ్చే కథ కాదంటూ చాలామంది నిరుత్సాహపరిచారు. ఎన్టీఆర్ వద్దన్నా కూడా వినలేదు. సీతారామరాజుగా ఎన్టీఆర్ వెంటనే నటిస్తానంటే డ్రాప్ అవుతాను తప్ప లేదంటే తానే చేస్తానని తెగేసి చెప్పారు. చింతపల్లి ఫారెస్ట్లో పదిరోజుల షూటింగ్ తర్వాత డైరెక్టర్ రామచంద్రరావు చనిపోయారు. ఆయనకు ఇచ్చిన మాట కోసం డైరెక్షన్ తానే చేశారు. నెలల తరబడి రంపచోడవరం ఫారెస్ట్లో షూటింగ్ చేశారు. ఎన్నో సందేహాలు, విమర్శల మధ్య 1974లో విడుదలైన ఈ సినిమా సాధించిన రికార్డులెన్నో.
పడినా..పైకి లేస్తూ
‘అల్లూరి సీతారామరాజు’ సినిమా చేశాక ఆ గ్రేట్ క్యారెక్టర్ ఎఫెక్ట్ వల్ల, తర్వాత రెండేళ్ల పాటు వరుస ప్లాపులు అందుకోవాల్సి వచ్చింది. చేతిలో సినిమాలు లేని పరిస్థితికి వచ్చారు. తిరిగి సొంత బ్యానర్లో చేసిన ‘పాడిపంటలు’తో సక్సెస్ ట్రాక్ ఎక్కారు. నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన కెరీర్లో 350కి పైగా సినిమాలు చేశారంటే ఆయన ఎంత బిజీ హీరోనో అర్థం చేసుకోవచ్చు. ఏడాదికి పదికి పైగానే ఆయన నటించిన సినిమాలు విడుదలయ్యేవి. 1972లో అయితే ఏకంగా పద్దెనిమిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘అసాధ్యుడు’ (1968) మొదలు సంక్రాంతికి కృష్ణ సినిమాలు రిలీజ్ చేయడం సెంటిమెంట్గా మారింది. సంక్రాంతికి వచ్చిన ఆయన సినిమాల్లో ఎక్కువ శాతం సక్సెస్ సాధించాయి. 44 ఏళ్లలో దాదాపు 30 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవడం విశేషం.
సొంత బ్యానర్తో స్టార్ ఇమేజ్
1970లో వచ్చిన ‘అగ్నిపరీక్ష’ చిత్రంతో పద్మాలయ బ్యానర్ స్టార్ట్ చేసి నిర్మాతగా మారారు కృష్ణ. కానీ ఆ చిత్రం నిరాశ పరిచింది. రెండో సినిమాతో ఎలాగైనా హిట్ అందుకోవాలని హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో కౌబాయ్ కాన్సెప్ట్తో ‘మోసగాళ్లకు మోసగాడు’ను నిర్మించారు. కె.ఎస్.ఆర్ దాస్ దర్శకుడు. మన నేటివిటీ లేదు కనుక ఆడదన్నారు. ప్రివ్యూ చూసిన ఎన్టీఆర్ మాత్రం సూపర్ సక్సెస్ అవుతుందన్నారు. 1971లో విడుదలైన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోనూ డబ్ అయింది. నాలుగు రెట్లకు పైగా లాభాలతో పాటు, కృష్ణ ఆశించిన స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘పండంటి కాపురం’తో తన బ్యానర్లో మరో భారీ హిట్ అందుకున్నారు. ఇక ఎన్టీఆర్తో కలిసి నటిస్తూ నిర్మించిన ‘దేవుడు చేసిన మనుషులు’ కూడా సూపర్ సక్సెస్ను అందుకుంది. దేవదాసు, కురుక్షేత్రం, ఈనాడు.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని వైవిధ్యమైన కథాంశాలతో కూడిన చిత్రాలను ఈ బ్యానర్లో నిర్మించి నిర్మాతగానూ ప్రూవ్ చేసుకున్నారు కృష్ణ. తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషల్లో సినిమాలను నిర్మించారు. హిందీలో హిమ్మత్ వాలా, పాతాళ్ భైరవి, మవాలి వంటి బ్లాక్ బస్టర్స్ తీశారు.
ట్రెండ్ సెట్టర్..
తెలుగు సినిమా ఇండస్ట్రీకి కృష్ణను ఒక ట్రెండ్ సెట్టర్గా చెప్పొచ్చు. నటుడిగా కెరీర్ ప్రారంభించి, నిర్మాతగా, దర్శకుడిగా ఎన్నో సినిమాలు తీశారు. స్టూడియోఅధినేతగానూ మెప్పించారు. అంతేకాదు కొత్త విషయాలను, టెక్నాలజీని టాలీవుడ్కు పరిచయం చేసిన క్రెడిట్ ఆయనదే. కృష్ణ నటించిన తొలి చిత్రం ‘తేనెమనసులు’ ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ సోషల్ మూవీ. తెలుగులో ఫస్ట్ జేమ్స్ బాండ్ మూవీ ‘గూఢచారి 116’, తొలి ప్యూజీ రంగుల చిత్రం ‘భలే దొంగలు’, తొలి సినిమా స్కోప్ టెక్నో విజన్ చిత్రం ‘దొంగల దోపిడి’, మొదటి కౌబాయ్ మూవీ ‘మోసగాళ్లకు మోసగాడు’, తొలి ఫుల్ స్కోప్ మూవీ ‘అల్లూరి సీతారామరాజు’, తొలి 70ఎంఎం సినిమా ‘సింహాసనం’, తొలి డీటీయస్ సినిమా ‘తెలుగు వీర లేవరా’ చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు.
హిట్ పెయిర్
ఎనభైమంది హీరోయిన్స్ కృష్ణతో కలిసి నటించినప్పటికీ విజయ నిర్మల, జయప్రద, శ్రీదేవిలు ఎక్కువ సినిమాల్లో నటించిన ఆయనకు హిట్ పెయిర్గా నిలిచారు. జయప్రదతో 43, శ్రీదేవితో 31 సినిమాలు చేసిన ఆయన విజయ నిర్మలతో అత్యధికంగా నలభై ఏడు చిత్రాల్లో నటించారు. ‘సాక్షి’ సినిమాలో జంటగా నటించిన కృష్ణ, విజయ నిర్మల ప్రేమించుకుని పెళ్లి బంధంతో 1969లో ఒక్కటయ్యారు. విజయ నిర్మల డైరెక్టర్గా సక్సెస్ అవ్వడంలోనూ కృష్ణ పాత్ర చాలా ఉంది.
మల్టీ స్టారర్స్లో మేటి..
ఎన్టీఆర్, ఏఎన్నార్తో పాటు తన సమకాలికులైన శోభన్ బాబు, కృష్ణంరాజుతోనూ కృష్ణకు ఫ్రెండ్లీ రిలేషన్ ఉండేది. ఆ రిలేషన్తోనే యాభైకి పైగా మల్టీస్టారర్ మూవీస్ చేసి రికార్డు సృష్టించారు. ఎన్టీఆర్తో కలిసి స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం, దేవుడు చేసిన మనుషులు, వయ్యారి భామలు–వగలమారి భర్తలు చిత్రాల్లో నటించారు. అలాగే ఏఎన్నాఆర్తో.. మంచి కుటుంబం, అక్కాచెల్లెలు, హేమా హేమీలు, గురుశిష్యులు, ఊరంతా సంక్రాంతి, రాజకీయ చదరంగం చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలు నటించిన హీరో కృష్ణంరాజు. వీరిద్దరూ 19 చిత్రాల్లో కలిసి నటించారు. శోభన్బాబుతో పదమూడు, మోహన్బాబుతో నాలుగు, కాంతారావుతో మూడు, శివాజీ గణేశన్తో మూడు, రజినీకాంత్తో మూడు, సుమన్తో మూడు, నాగార్జునతో రెండు, చిరంజీవి, బాలకృష్ణ, హరికృష్ణ, రవితేజ, రాజశేఖర్లతో ఒక్కో సినిమా చేశారు. తన కొడుకులు రమేష్బాబుతో ఐదు, మహేష్ బాబుతో ఏడు చిత్రాల్లో కనిపించారు. మూడోతరమైన మహేష్ కొడుకు గౌతమ్తోనూ కృష్ణ నటించాలనుకున్నారు. కానీ ఆ కోరిక నెరవేరకుండానే ఆయన వెళ్లిపోయారు.
రాజీవ్ చొరవతో రాజకీయాల్లోకి..
రాజీవ్ గాంధీ చొరవతో 1984లో కాంగ్రెస్ లో చేరిన కృష్ణ 1989లో కాంగ్రెస్ ఎంపీగా ఏలూరు నుంచి గెలిచారు. తర్వాత రాజీవ్ మరణానంతరం కృష్ణ రాజకీయాలకు దూరమయ్యారు. అంతకుముందు పార్టీ ఆదేశాలతో ఎన్టీఆర్కు వ్యతిరేకంగా మండలాదీశుడు, గండిపేట రహస్యం, నా పిలుపే ప్రభంజనం లాంటి పొలిటికల్ సెటైరికల్ సినిమాలు తీశారు కృష్ణ.
నిర్మాతల హీరో
హీరోగానే గాక మంచి మనసున్న వ్యక్తిగానూ సూపర్ స్టార్ కృష్ణకు పేరు ఉంది. తాను నటించిన సినిమా ప్లాప్ అయితే వెంటనే ఆ నిర్మాతను పిలిచి.. మళ్ళీ మంచి కథ సిద్ధం చేసుకోమని, ఎలాంటి రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేస్తానని మాటిచ్చేవారు. ఆ మాటను నిలబెట్టుకునేవారు కూడా. అంతేకాదు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కూడా సపోర్ట్గా నిలిచేవారు. అలా ఏనాడూ పారితోషికం విషయంలో ఎవర్నీ ఇబ్బంది పెట్టలేదు. అందుకే ఆయన్ని నిర్మాతల హీరో అని అంటుంటారు.
ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోయి..
మహేష్ బాబు జీవితంలో ఈ ఏడాది అత్యంత విషాదంగా మారింది. జనవరి 8న అన్న రమేష్ బాబు చనిపోయారు. ఆ బాధ నుండి తేరుకునేలోపు సెప్టెంబర్ 28న తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. తల్లి దూరమైందనే బాధ మరువకముందే ఇప్పుడు తండ్రి కూడా దూరమయ్యారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోయిన మహేష్ దుఃఖంలో మునిగిపోయాడు.
నటవారసత్వం
1962 నవంబర్ 20న ఇందిరా దేవిని కృష్ణ పెళ్లి చేసుకున్నారు. ‘తేనెమనసులు’ షూటింగ్ టైమ్కే కృష్ణకు వివాహమై, రమేష్ బాబు పుట్టారు. కృష్ణ, ఇందిరా దేవి దంపతులకు ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. హీరోగా, నిర్మాతగా పలు చిత్రాలు చేసిన పెద్ద కొడుకు రమేష్ బాబు ఈ ఏడాదే మరణించారు. రెండో కొడుకు మహేష్ బాబు తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా రాణిస్తున్నారు. పెద్ద కూతురు పద్మావతిని గల్లా జయదేవ్కు ఇచ్చి పెళ్లి చేశారు. వారి కొడుకు అశోక్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. రెండో కూతురు మంజుల నటి, నిర్మాత. మూడో కూతురు ప్రియదర్శిని భర్త సుధీర్ బాబు హీరోగా కొనసాగుతున్నారు.
అవార్డులు
ఆయన నటన, చిత్రపరిశ్రమకు చేసిన సేవలకు గాను పలు అవార్డులు వరించాయి. 1974లో అల్లూరి సీతారామరాజు చిత్రానికిగానూ బెస్ట్ యాక్టర్గా నంది అవార్డు అందుకున్నారు. 1997లో ఫిల్మ్ఫేర్ లైఫ్ అచీవ్మెంట్, 2003లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం , 2008లో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 2009లో పద్మభూషణ్ పురస్కారం కృష్ణను వరించాయి.