2 వారాల డెడ్ లైన్.. 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి : సుప్రీంకోర్టు

2 వారాల డెడ్ లైన్..  84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వండి : సుప్రీంకోర్టు

విద్యుత్‌ ఉద్యోగుల విభజన వ్యవహారాన్ని ఉద్దేశించి తెలంగాణ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇవాళ దీనిపై విచారణ జరిపిన దేశ సర్వోన్నత న్యాయస్థానం.. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర సర్కారు ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది. ఆంధ్ర నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి వచ్చిన వారికి పోస్టింగ్‌ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వానికి చివరి అవకాశం ఇస్తున్నామని ధర్మాసనం స్పష్టంచేసింది.

రెండు వారాల్లో జస్టిస్ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశించింది. ఏపీ నుంచి రిలీవ్ అయిన 84 మందికి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని నిర్దేశించింది. విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ నెల 31న మరోసారి సమీక్ష చేయనున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి కోర్టు జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయలేదంటూ ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.