
'బర్త్ రైట్ సిటిజన్ షిప్' చట్టాన్ని రద్దు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అమెరికా సుప్రీం కోర్టులో భారీ ఊరట దక్కింది. జాతీయ స్థాయిలో ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ను నిలిపివేసే అధికారం జిల్లా జడ్జిలకు లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అమెరికాకు ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే తీసుకున్న సంచలన నిర్ణయాల్లో 'బర్త్ రైట్ సిటిజన్ షిప్' చట్టం రద్దు(Birthright Citizenship) ఒకటి. ఈ నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై అమెరికాలోని పలు రాష్ట్రాల జిల్లా న్యాయస్థానాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. ట్రంప్ ప్రభుత్వం జారీ చేసిన ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను అడ్డుకున్నాయి. దీంతో.. ట్రంప్ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో తాజాగా ట్రంప్కు అనుకూలంగా తీర్పు వచ్చింది.
అమెరికాకు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన వెంటనే 'బర్త్ రైట్ సిటిజన్ షిప్' చట్టాన్ని రద్దు చేసి కాక రేపిన సంగతి తెలిసిందే. ఇది విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడినవారిపై తీవ్ర ప్రభావితం చూపిస్తుంది. అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలకు చెందినవారు తమ పిల్లలు అమెరికన్ పౌరసత్వం పొందాలని కలలు కనేవారికి ట్రంప్ నిర్ణయం కంట్లో కారం పడినట్టైంది. అమెరికాకు వలస వెళ్లిన వాళ్లకు అక్కడ పిల్లలు పుడితే.. వారికి ఆటోమేటిక్గా యూఎస్ సిటిజన్ షిప్ వర్తించే చట్టాన్ని ట్రంప్ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు.. 2025 జనవరిలో 'బర్త్ రైట్ సిటిజన్ షిప్' హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఫిబ్రవరి19, 2025 తర్వాత పుట్టే పిల్లలకు ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో చదువు ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లి సెటిల్ అయినా గ్రీన్ కార్డు లేనివారికి పుట్టే పిల్లలకు ఇకపై ఆ దేశ పౌరసత్వం లభించదు.
భారతీయులతో సహా లక్షలాది మంది వలసదారులకు ఇబ్బందులు తప్పవు. అమెరికా జనాభాలో భారతీయులు దాదాపు 1 47% (55 లక్షలు) వరకూ ఉన్నారు. వీటిలో 34% మంది అమెరికాలోనే జన్మించారు. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో వీళ్లలో ఇంకా గ్రీన్ కార్డు రాని వాళ్లకు పుట్టే పిల్లలకు పౌరసత్వం రాదు. అమెరికాలో పుట్టినవారంతా ఆ దేశ పౌరులే అన్నది అమెరికాలో అమలవుతున్న చట్టం. 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇమిగ్రెంట్లకు అమెరికా ఈ 'బర్త్ రైట్ సిటిజన్ షిప్' హక్కును కల్పించింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ట్రంప్ ఈ చట్టానికి ముగింపు పలుకుతూ ఉత్త ర్వులు జారీ చేశారు.