పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి ఊరట

పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది సూరత్ సెషన్స్  కోర్ట్. రాహుల్ గాంధీకి ఏప్రిల్ 13 వరకు బెయిల్ పొడిగించింది.  పరువునష్టం కేసులో కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ అప్పీల్​కు వెళ్లారు. తనను దోషిగా తేల్చి రెండేండ్ల జైలు శిక్ష విధిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును పైకోర్టులో సోమవారం సవాల్ చేశారు. విచారణ జరిపిన కోర్టు.. బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13వ తేదీన ఉంటుందని స్పష్టం చేసింది కోర్టు. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి విధించిన రెండేళ్ల జైలు శిక్షపై విచారణను మే 3వ తేదీన చేపట్టనున్నట్లు వెల్లడించింది కోర్టు. 

2023, మార్చి 23న సూరత్‌లోని కోర్టు.. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యకు సంబంధించి దాఖలైన క్రిమినల్ పరువు నష్టం దావాలో ఈ శిక్ష విధించింది. అయితే.. అదే రోజు కోర్టు  రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. అతని శిక్ష అమలుపై 30 రోజుల స్టే విధించింది. పై కోర్టులో అప్పీల్ చేసుకోవటానికి అవకాశం కల్పించింది కోర్టు. ఈ తీర్పును సవాల్ చేస్తూ.. ఏప్రిల్ 3వ తేదీ సూరత్ సెషన్స్  కోర్టులో సవాల్ చేశారు రాహుల్ గాంధీ.