బిడ్డను కొనుక్కొచ్చి సరోగసీ నాటకం.. సృష్టి టెస్ట్ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు

బిడ్డను కొనుక్కొచ్చి సరోగసీ నాటకం.. సృష్టి టెస్ట్ట్యూబ్ కేసులో విస్తుపోయే నిజాలు
  • నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కొడుకు అడ్వకేట్ జయంత్ కృష్ణ అరెస్ట్​
  • గాంధీ హాస్పిటల్ అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్​తో పాటు మరో ఐదుగురు కూడా!
  • సరోగసీ పేరిట సికింద్రాబాద్​లోని దంపతుల నుంచి రూ. 40 లక్షలు వసూలు
  • పేదింటి మహిళకు పుట్టిన బిడ్డను రూ. 90 వేలకు కొని.. సరోగసీబిడ్డగా ఫ్రాడ్​
  • డీఎన్​ఏ టెస్టులు చేయాలని కోరినా వినని సెంటర్​ నిర్వాహకులు
  • లీగల్​ సమస్యలు వస్తాయంటూ దంపతులకు నమ్రత కొడుకు బెదిరింపులు
  •  వేరే దగ్గర డీఎన్​ఏ టెస్టులు చేస్కోవడంతో వెలుగులోకి బాగోతం
  • 2021లోనే ముగిసిన క్లినిక్​ పర్మిషన్.. అయినా అక్రమంగా నిర్వహణ
  •  వివరాలను వెల్లడించిన నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్

పద్మారావునగర్, వెలుగు: సంచలనం సృష్టించిన సికింద్రాబాద్​ సృష్టి టెస్ట్​ ట్యూబ్ సెంటర్​ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. సరోగసీముసుగులో బిడ్డను కొని తెచ్చి ఇచ్చినట్లు తేలింది. ఈ విషయాన్ని నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్ వెల్లడించారు. హైదరాబాద్​ జిల్లా డీఎంహెచ్​వో  వెంకట్​తో కలిసి ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. రాజస్తాన్​కు చెందిన దంపతులు నాలుగేండ్లుగా సికింద్రాబాద్​ మారేడ్ పల్లిలో నివాసం ఉంటున్నారు. చాలా ఏండ్లుగా సంతానం కలగకపోవడంతో వీరు నిరుడు ఆగస్టులో సికింద్రాబాద్​లోని సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ ను సంప్రదించారు. అయితే.. మీరు ఐవీఎఫ్​ ద్వారా పిల్లలు కనడానికి వీలు పడదని, సరోగసీ ఉత్తమ మార్గమని ఆ దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంట​ర్​ డాక్టర్ ఎ.నమ్రత చెప్పారు. దాంతో సరోగసీ(అద్దె గర్భం) కి ఒప్పుకున్న దంపతుల నుంచి రూ.30 లక్షలను క్లినిక్​ నిర్వాహకులు వసూలు చేశారు. వైద్య పరీక్షల కోసం దంపతులను ఇద్దరిని విజయవాడకు పంపించారు. అక్కడ వీరు శాంపిల్స్​ ఇచ్చారు. కొద్ది రోజుల తర్వాత సరోగసీ కోసం గర్భం మోసే మహిళ దొరికిందని దంపతులను నమ్మించారు.

 ఈ క్రమంలో  ఈ ఏడాది జూన్​ నెలలో సృష్టి టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ వారు ఆ దంపతులకు ఫోన్​ చేసి.. వైజాగ్​లో అద్దెగర్బం ధరించిన మహిళ డెలివరీ అయిందని, మగబిడ్డ జన్మించాడని, సీ సెక్షన్  అయినందున మరో రూ. పది లక్షలు ఇవ్వాలని డిమాండ్​ చేసి, వారి వద్ద నుంచి అదనంగా ఆ డబ్బులు వసూలు చేశారు. వైజాగ్​కు వెళ్లిన దంపతులకు.. అక్కడి క్లినిక్​వారు ఓ బాబును ఇచ్చారు. అయితే.. పుట్టిన బాబు ముఖ కవళికలు, రంగు తమకు మ్యాచ్​ కాకపోవడంతో ఆ దంపతులకు కొంత అనుమానం వచ్చింది.  ఒప్పందం ప్రకారం.. ఆ బిడ్డకు డీఎన్​ఏ పరీక్షలు చేయాల్సి ఉండగా, దంపతులు చాలాసార్లు అడిగినప్పటికీ అందుకు క్లినిక్​ వాళ్లు స్పందించకుండా దాటవేశారు. ఈ విషయమై క్లినిక్​ ఓనర్​ డాక్టర్​ నమ్రతను దంపతులు నిలదీశారు. దాంతో వారిని నమ్రత బెదిరించింది. క్లినిక్​ నడిచే బిల్డింగ్​లోనే  డా. నమ్రత కొడుకు జయంత్​ కృష్ణ అడ్వకేట్​గా ప్రాక్టిస్​ చేస్తూనే, క్లినిక్​ మేనేజర్​గా వ్యవహరిస్తున్నాడు. ఇలా మోసపోయిన దంపతులకు జయంత్ కృష్ణ.. లీగల్​గా మీరు కూడా ఇబ్బంది పడతారని, కోర్టు కేసుల్లో ఇరుక్కుంటారని బెదిరించాడు. చివరికి  చేసేదేమి లేక దంపతులు తమ సొంత ఖర్చుతో  ఢిల్లీలో డీఎన్​ఏ టెస్టులు చేయించుకున్నారు. డీఎన్​ఏ రిపోర్టును చూసి దంపతులు షాక్​ తిన్నారు. తండ్రి డీఎన్​ఏతో బాబు డీఎన్​ఏ మ్యాచ్ కావడం లేదని డీఎన్​ఏ రిపోర్టులో వెల్లడైంది. ఈ విషయమై పలుమార్లు అడుగుదామని దంపతులు క్లినిక్​కు వెళ్తే..  డాక్టర్లు స్పందించకపోగా, పైగా వీరినే బెదిరించారు. చివరికి గోపాలపురం పోలీస్ ​స్టేషన్​ను ఆశ్రయించి, జరిగిన మోసాన్ని వివరించారు. స్పందించిన నార్త్​ జోన్​ పోలీసులు డీసీపీ ఎస్​.రష్మీ పెరుమాళ్ ఆధ్వర్యంలో దాదాపు గత రెండు వారాలుగా దర్యాప్తు చేసి, పలు కీలక అంశాలపై పురోగతి సాధించారు. 

పేద గర్భిణిని వైజాగ్​ తరలించి..!

అసలు భర్త వీర్యంతో  సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్​లోని ఓ ఏజెంట్ నుంచి పేద దంపతులను ఒప్పించి, వారికి రూ. 90 వేల వరకు ఇచ్చి, పుట్టబోయే బిడ్డ కొనుగోలుకు ప్లాన్​ వేశారు. సరిగ్గా డెలివరీ సమయంలో ఆ పేదింటి గర్బిణి దంపతులను విమానంలో హైదరాబాద్​ నుంచి వైజాగ్​కు పంపించి.. అక్కడ డెలివరీ చేయించారు. డెలివరీ తర్వాత ఆ విషయం సరోగసికి ఒప్పుకున్న దంపతులకు చెప్పి.. మీ బాబే అంటూ అప్పగించారు. 

క్లినిక్​ అనుమతి ముగిసినా వేరే వాళ్ల సర్టిఫికెట్​తో!

సృష్టి టెస్ట్​ ట్యూబ్​ బేబీ సెంటర్​ అనుమతి గడువు 2021లోనే ముగిసిందని, అయినా వేరే సర్టిఫైడ్​ డాక్టర్​ సూరి శ్రీమతి పేరు మీద అక్రమంగా డాక్టర్​ నమ్రత సృష్టి క్లినిక్​ను నడిపిస్తున్నారని హైదరాబాద్​ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.వెంకట్ తెలిపారు. వాస్తవానికి ఇండియాలో కమర్షియల్​ సరోగసికి అనుమతి లేదని, కేవలం మానవతా దృక్పథంతో దగ్గరి వారితో అద్దె గర్భం పద్ధతి ఉందని అన్నారు. కాగా.. ఈ కేసులో సరోగసీ లేదని, పేద దంపతుల నుంచి బిడ్డను కొనుగోలు చేసి బాధిత దంపతులకు ఇచ్చారన్నారు. సృష్టి సెంటర్​పై సోదాల్లో తాము కూడా పాల్గొన్నామన్నారు. 2021లో క్లినిక్​ అనుమతులు క్లోజ్​ అయ్యాయని, దాంతో తాము అప్పట్లోనే ఆ క్లినిక్​ను మూసివేస్తూ క్లోజింగ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చామని తెలిపారు. కానీ, అక్రమంగా టెస్ట్​ ట్యూబ్​ సెంటర్​ ను నడుపుతున్నారని అన్నారు. క్లినిక్​ సెంటర్​ లో థియేటర్​ను గుర్తించామని, అనస్థీషియా ల్యాబ్​, బెడ్స్​, ఏడు రకాల అనాలసిస్​ చేసే మెడికల్​ ఎక్విప్​ మెంట్​ ఉందని పేర్కొన్నారు. డస్ట్ బిన్​ చెక్​ చేస్తే రెగ్యులర్​గా ప్రాసెస్​ చేస్తున్నట్లు ఆధారాలు దొరికాయన్నారు. తెలంగాణ మెడికల్​ కౌన్సిల్​ సర్టిఫికెట్​ గడువు ముగిసినప్పటికీ అక్రమంగా ఆసుపత్రి 
నడుపుతున్నారని పేర్కొన్నారు. 

డాక్టర్​ నమ్రత, ఆమె కొడుకు సహా 8 మంది అరెస్ట్​

సృష్టి టెస్ట్ ట్యూబ్​ సెంటర్​ సరోగసీమోసం కేసులో ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేసినట్లు నార్త్​ జోన్​ డీసీపీ రష్మీ పెరుమాళ్​ తెలిపారు. మరికొందరు పరారీలో ఉన్నారని, గాలింపు చేపట్టామని, రెండు రాష్ట్రాల్లోని సృష్టి బ్రాంచుల్లో తమ పోలీసు బృందాలు, వైద్యాధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఈ కేసులో 8 మంది అరెస్ట్ చేయగా, వీరిని అంతకన్నా ముందుగా గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అరెస్ట్ అయిన వారిలో సృష్టి టెస్ట్ ట్యూబ్​ సెంటర్ (ఏపీ, తెలంగాణ)​ నిర్వహకురాలు డాక్టర్​ అతలూరి నమ్రత (64), ఆమె కుమారుడు, క్లినిక్​ మేనేజర్​ జయంత్ కృష్ణ(25), సృష్టి వైజాగ్​ బ్రాంచీ మేనేజర్​ కళ్యాణి (40), ల్యాబ్​ టెక్నిషియన్​, ఎంబ్రలాజిస్ట్​ చెన్నారావు(37), గాంధీ ఆస్పత్రి అనిస్థిషీయా అసిస్టెంట్ ప్రొఫెసర్​ నర్గుల సదానందం(41),  అస్సాంకు చెందిన సిబ్బంది సంతోషి(38), మహ్మాద్​ అలీ అదిక్​(38), నస్రీన్​ బేగం(25)  ఉన్నారు. క్లినిక్​లోని మెడికల్​ ఎక్విప్​ మెంట్, మెడిసిన్​, మొబైల్​ ఫోన్స్, డిజిటల్​ డివైసెస్​, కేసు రికార్డులు, సరోగసి, ఐవీఎప్​ డాక్యుమెంట్లును స్వాధీనం చేసుకొని సీజ్​ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.  

రూ.4 వేలకు స్పెర్మ్‌ కొని..  

రూ. 4 వేలకు స్పెర్మ్​ను కొనుగోలు చేస్తున్న హైదరాబాద్​లోని కొన్ని క్లినిక్​లు అక్రమంగా వాటిని గుజరాత్, అహ్మదా​బాద్​ ఫెర్టిలిటీ సెంటర్లకు పంపిస్తున్నట్లు వెల్లడైంది. వీరిని కూడా విచారిస్తున్నట్లు డీసీపీ రష్మీ తెలిపారు. డాక్టర్ నమ్రతపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐవీఎప్​ ఫెయిల్యూర్​, సరోగసీ అక్రమాలపై పదికి పైగా కేసులున్నట్లు వెల్లడించారు. డాక్టర్​నమ్రత 1995లో మెడికల్​ ప్రాక్టీస్​ ప్రారంభించి, 1998లో ఫెర్టిలిటీ, ఐవీఎప్​ రంగంలోకి వచ్చి.. సరోగసీ, ఐవీఎఫ్​ల పేరిట భారీగా అక్రమార్జన చేసినట్లు తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్​, కొండాపూర్​లో  సృష్టి టెస్ట్​ట్యూబ్​ సెంటర్​ బ్రాంచీలను నెలకొల్పి, మెడికల్ దోపిడీకి తెరతీశారని డీసీపీ పేర్కొన్నారు. ఒక్కో ఐవీఎఫ్​, సరోగసీపేరున రూ. 20 లక్షల నుంచి 30 లక్షల వరకు వసూలు చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు.