
నిజామాబాద్, వెలుగు: యాభై రోజుల శిక్షణ తర్వాత నిర్వహించే పరీక్షలో పాసయ్యే సర్వేయర్లకు మాత్రమే ప్రభుత్వం లైసెన్స్లు జారీ చేస్తుందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గురువారం నగరంలోని గిరిరాజ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో లైసెన్స్డ్ సర్వేయర్ల కోసం నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించి మాట్లాడారు. సర్వేలతోనే భూ వివాదాలు పరిష్కారమవుతాయన్నారు.
తరచూ గెట్టు పంచాదీలు లేకుండా హద్దులు నిర్ణయించి సర్వేమ్యాప్ను పాస్బుక్స్కు అటాచ్ చేయాలని భూభారతి చట్టం స్పష్టం చేస్తోందన్నారు. భూముల క్రయవిక్రయాలు, సక్సెషన్ కు మ్యాప్ తప్పనిసరి అన్నారు. భూభారతి చట్టం గొప్ప మార్పునకు నాందిపలికిందని సర్వేయర్ల కొరతను తీర్చడానికి లైసెన్స్డ్ సర్వేయర్ల ఎంపిక చేపట్టిందన్నారు. కలెక్టర్ వెంట సర్వే ల్యాండ్ రికార్డ్ ఏడీ అశోక్ తదితరులు ఉన్నారు.
దరఖాస్తుదారులను తిప్పొద్దు..
భూ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్న వారిని ఆఫీస్ చుట్టూ తిప్పొద్దని కలెక్టర్ సూచించారు. గురువారం జక్రాన్పల్లి మండలం కేశ్పల్లి గ్రామంలోని రెవెన్యూ సదస్సులో పాల్గొని మాట్లాడారు. తహసీల్దార్ పరిధిలోని సమస్యలను అక్కడే పరిష్కరించాలన్నారు. సదస్సులో స్వీకరించిన అప్లికేషన్లను పరిశీలించి రికార్డులో ఎంటర్ చేయాలన్నారు. ఆర్మూర్ ఆర్డీవో రాజాగౌడ్, తహసీల్దార్లు కిరణ్మయి, సంతోష్రెడ్డి పాల్గొన్నారు.
ఇసుక కొరత రావద్దు..
బాల్కొండ, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక కొరత రాకుండా చూడాలని కలెక్టర్ మండల ఆఫీసర్లకు సూచించారు. గురువారం బాల్కొండ మండల కేంద్రంలో ఇండ్ల నిర్మాణాలను పరిశీలించి మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు తర్వగా పూర్తయ్యేలా చూడాలని ఆర్డీవోలకు తెలిపారు. వర్షాలు పెరుగక ముందే ఇసుక నిల్వలు పెట్టి లబ్ధిదారులకు ఫ్రీగా ఇవ్వాలన్నారు.
అంతకు ముందు మెండోరా మండల కేంద్రంలో భూభారతి అమలు తీరు, రైతుల ఇబ్బందులను అడిగి తెలుకున్నారు. పట్టా బుక్ లో ఉన్న భూమి మోకాపై లేదని మహిళా రైతు కలెక్టర్ కు విన్నవించుకుంది. ఎలాంటి తప్పిదాలు లేకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఆర్టీవో రాజా గౌడ్, ఎంపీడీవో విజయ్భాస్కర్ తదితరులు ఉన్నారు.