వెల్దుర్తి, వెలుగు : భూ డిజిటల్ సర్వే కోసం లంచం తీసుకుంటూ మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు సర్వేయర్లు ఏసీబీ ఆఫీసర్లకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఏసీబీ మెదక్ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం... వెల్దుర్తి మండల కేంద్రానికి చెందిన రైతు రాజు తన 1.10 ఎకరాల పొలాన్ని డిజిటల్ సర్వే చేయాలని సర్వేయర్ శ్రీనివాస్కు దరఖాస్తు చేశాడు. ఇందుకు రూ. 20 వేలు ఇవ్వాలని సర్వేయర్ డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు.
వారి సూచనతో బుధవారం సర్వేయర్ శ్రీనివాస్కు ఫోన్ చేసి రూ. 20 వేలు ఇస్తానని చెప్పడంతో.. స్థానిక ఇండేన్ పెట్రోల్ బంక్ వద్దకు రావాలని సర్వేయర్ సూచించాడు. దీంతో రాజు బంక్ వద్దకు వెళ్లి సర్వేయర్ను కలువగా... అక్కడే ఉన్న ట్రైనీ సర్వేయర్ గౌరీ శరత్కుమార్గౌడ్కు డబ్బులు ఇవ్వాలని చెప్పడంతో రైతు అతడికి రూ. 20 వేలు ఇచ్చాడు.
అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు ఇద్దరు సర్వేయర్లను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం వారిని తహసీల్దార్ ఆఫీస్కు తీసుకొచ్చి విచారణ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు.
