సూర్యాపేట, వెలుగు: రైతులకు రూ. 5కే వ్యవసాయ మార్కెట్లో నాణ్యమైన భోజనం అందజేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నిత్యం రైతులు వస్తున్నారు. వారు మధ్యాహ్నం భోజనం చేయడం ఇబ్బందికరంగా ఉండడంతో మార్కెట్లో 5 రూపాయల భోజనాన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా మార్కెట్లో రైతులను అడిగినప్పుడు భోజనానికి ఇబ్బంది అవుతుందని పలువురు తెలియజేశారన్నారు. అందుకే మార్కెట్లో ఐదు రూపాయల భోజనం పథకాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. ఈ పథకానికి సహకరిస్తున్న హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ కు ధన్యవాదాలు తెలియజేశారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, మార్కెట్ కమిటీ సెక్రటరీ ఫజీయుద్దిన్, డైరెక్టర్లు ఉప్పల సత్యనారాయణ, మాడుగుల నవీన్, పచ్చిపాల వెంకన్న, కరీం,నరసింహ చారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ అలి, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మార్కెట్ సహాయ కార్యదర్శి వెంకటరెడ్డి, కాశిం, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోనాల రవీందర్ పాల్గొన్నారు.
