- ఒడిశా బార్డర్లో గుర్తించిన పోలీసులు
- పోలీసులు అదుపులో కిడ్నాపర్లు
- నేడు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం
మహదేవపూర్, వెలుగు : మూడు రోజుల కింద కిడ్నాప్ కు గురైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి సూరం మహేశ్ ను పోలీసులు రక్షించారు. బుధవారం పనిపై మహారాష్ట్రలోని సిరివంచ తాలూకాలో పనిపై వెళ్లిన మహేశ్తర్వాత కనిపించకుండా పోయాడు. డబ్బుల కోసం కిడ్నాపర్ల ఫోన్లు, పోలీసుల వేట కలిసి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించగా ఎట్టకేలకు ఒడిశా బార్డర్ లో మహేశ్ ఉన్నట్టు గుర్తించి క్షేమంగా మహదేవపూర్ పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు. ఐదుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. పూర్తి వివరాలను శనివారం వెల్లడించనున్నారు.
జరిగింది ఇది
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల ప్రధాన కార్యదర్శి సూరం మహేశ్ బుధవారం ఉదయం మహేశ్ తనకు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరివంచ తాలూకాలో ఉన్న కొత్తపల్లిలో బ్యాంక్ పని ఉందని బైక్పై వెళ్లాడు. మధ్యాహ్నం ఫ్రెండ్కు ఫోన్ చేసి తన బైక్ను మేడిగడ్డ బ్యారేజీ ఆవల(మహారాష్ట్ర వైపు) పోచంపల్లి అడవి సమీపంలో పార్క్చేశానని, తనకు వేరే పని ఉండి వెళ్తున్నానని, తీసుకువెళ్లాలని కోరాడు. సాయంత్రం అక్కడికి వెళ్లేసరికి బండి ఆన్లో ఉండి కింద పడేసి ఉంది. మహేశ్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. కుటుంబసభ్యులకు చెప్పగా మహేశ్ భార్య బుధవారం రాత్రి పోలీసులకు కంప్లయింట్ఇవ్వడానికి వెళ్లింది. కానీ కిడ్నాప్ జరిగింది వేరే రాష్ట్రంలో కాబట్టి తాము కంప్లయింట్ తీసుకోలేమని మహదేవపూర్ పోలీసులుచెప్పారు. చివరికి ఎస్పీతో మాట్లాడించిన తర్వాత ఫిర్యాదు తీసుకుని ఎంక్వైరీ మొదలుపెట్టారు.
థ్రిల్లర్ మూవీని తలదన్నేలా...
బుధవారం కిడ్నాప్ చేసిన తర్వాత గురువారం ఉదయం రూ.2 లక్షలు మహేశ్ ఎకౌంట్ నుంచి కిడ్నాపర్గా భావిస్తున్న వ్యక్తి అకౌంట్కు ట్రాన్స్ ఫర్అయినట్టు పోలీసులు గుర్తించారు. మహేశ్ మొబైల్ సిగ్నల్స్ ట్రేస్ చేయగా ములుగు జిల్లా తాడ్వాయి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్లి వెతుకుతుండగా తెలుసుకున్న కిడ్నాపర్లు మహేశ్కుటుంబసభ్యులకు ఫోన్ చేసి మహేశ్తో మాట్లాడించారు. పోలీసులు వెంటనే వెళ్లిపోవాలని, లేకపోతే తనను చంపేస్తారని చెప్పాడు. రూ.50 లక్షలిస్తేనే వదిలేస్తానని అంటున్నారని చెప్పి ఫోన్ కట్చేశాడు. పోలీసులు ఫోన్ చేసిన లొకేషన్కు గంటలో వెళ్లగా ఎవరూ కనిపించలేదు. ట్రేస్ చేస్తే 150 కిలోమీటర్ల దూరంలో లొకేషన్ కనిపించింది. ఈ లోపు మహేశ్కుటుంబసభ్యులు కిడ్నాపర్లలో ఒకరిని పట్టుకోగా, మళ్లీ ఫోన్ చేసి అతడిని విడిచిపెట్టకపోతే మహేశ్ను చంపేస్తామని బెదిరించారు. దీంతో అతడిని వదిలేసి రూ.10 లక్షలు ఇస్తామనడంతో ఒప్పుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం వరకు కిడ్నాపర్లకు చెందిన రెండు మూడు ఎకౌంట్లకు మహేశ్ కుటుంబసభ్యులు రూ.8.5 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు. మరో రూ.లక్షా యాబై వేలను రెడీ చేసుకుంటుండగానే పోలీసులు కిడ్నాపర్లను పట్టుకుని మహేశ్ను రక్షించారు.
ఇంతకుముందూ బెదరింపు కాల్స్
ఆరు నెలల్లో మహేశ్కు అతడి భార్యకు నాలుగైదు సార్లు డబ్బులివ్వాలని బెదిరింపు కాల్స్వచ్చాయని తెలిసింది. కానీ సీరియస్గా తీసుకోకపోవడంతో అన్నంత పని చేశారు. శుక్రవారం మంథని బీజేపీ ఇన్చార్జ్ చంద్రుపట్ల సునీల్ రెడ్డి మహేశ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.