అక్రమ మిల్లింగ్​కు సహకరించిన ఆఫీసర్లపై వేటు

అక్రమ మిల్లింగ్​కు సహకరించిన ఆఫీసర్లపై వేటు
  •     బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​ మిల్లులకు వడ్లు మళ్లించినట్టు నిర్ధారణ 
  •     రూ.73 కోట్ల విలువైన వడ్లు పక్కదారి  
  •     ఇప్పటికే షకీల్​పై కేసు నమోదు

నిజామాబాద్​, వెలుగు : బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​ నిర్వహణలోని రైస్​ మిల్లులకు నిబంధనలకు విరుద్ధంగా సీఎంఆర్​ వడ్లు మళ్లించడమే కాకుండా పర్యవేక్షణ లోపంతో గోల్​మాల్​కు సహకరించిన ఇద్దరు జిల్లా సివిల్​సప్లయీస్​ఆఫీసర్లపై సస్పెన్షన్​ వేటు పడింది. నిజామాబాద్​ డీఎస్ఓ చంద్రప్రకాశ్, డీఎం జగదీశ్​ను సస్పెండ్​ చేస్తూ శుక్రవారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రూ.73 కోట్ల విలువ చేసే 37,019 టన్నుల వడ్లు పక్కదారి పట్టడానికి వారే 
కారకులని విచారణలో కన్ఫర్మ్​ చేసుకున్నాక సర్కారు ఈ యాక్షన్​ తీసుకుంది.  

37,019 మెట్రిక్​ టన్నులు మాయం 

బీఆర్ఎస్​ గవర్నమెంట్​హయాంలో రూలింగ్ ​పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న షకీల్ ​ సీఎంఆర్​ వడ్లను పక్కదారి పట్టించిన ఉదంతంపై ​కాంగ్రెస్​ సర్కారు ఎంక్వైరీ చేయించింది. బోధన్​ మండలంలోని తగ్గెల్లి గ్రామంలోని అమీర్​ ఆగ్రో ఫార్మ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్, రాహిల్​ఫుడ్స్, క్యాటరింగ్, సర్వీసెస్, ధన్విక్ ​ఆగ్రోమిల్స్, రాన్​ ఫుడ్స్​ అండ్ ​క్యాటరింగ్ ​సర్వీసెస్​ (కమ్మర్​పల్లి), సైరస్​ఆగ్రో ఇండస్ట్రీస్​ పేరుతో ఐదు రైస్​ మిల్లులను షకీల్​నడిపారు. 2021–-22 ఖరీఫ్​, యాసంగితో పాటు 2022-–23 ఖరీఫ్​ ఇలా మొత్తం మూడు సీజన్ల వడ్లు సుమారు లక్ష మెట్రిక్​ టన్నులను ఆఫీసర్లు ఆ మిల్లులకు మళ్లించారు. పంపిన వడ్లకు సమానంగా సీఎంఆర్​ రైస్​ పంపుతున్నారా? లేదా? అనేది మాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్​ సర్కారు వచ్చాక స్టేట్​ లెవెల్​లో సీఎంఆర్ ​వడ్లపై స్పెషల్ ​ఫోకస్​ పెట్టింది. ఈ క్రమంలో షకీల్​ నిర్వహణలోని రైస్​ మిల్స్​ 37,019 మెట్రిక్​ టన్నుల వడ్ల బాకీ ఉన్నట్లు గుర్తించింది. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు, విజిలెన్స్, టాస్క్​ఫోర్స్​ వింగ్స్​తో వేరువేరుగా విచారణ చేయించగా రూ.73 కోట్ల విలువైన వడ్లు మాయమైనట్టు రిపోర్టు ఇచ్చారు. 

విచారణాధికారులను తికమకపెట్టే ప్రయత్నం  

మాజీ ఎమ్మెల్యే షకీల్​ నిర్వహణలోని ఐదు రైస్​మిల్స్​కు పంపిన లక్ష మెట్రిక్​టన్నుల వడ్లలో 37,019 టన్నుల షార్టేజ్​ తేలగా కొత్త డ్రామా సృష్టించి విచారణ అధికారులను తికమక పట్టే ప్రయత్నం షకీల్​వైపు నుంచి జరిగింది. ఆరు నెలల నుంచి విచారణ నడుస్తుండగా తప్పించుకోడానికి మాజీ ఎమ్మెల్యే శతవిధాలా ప్రయత్నించారు. తన రైస్​మిల్లుల్లో టెక్నికల్ ​సమస్యలు వచ్చినందున తన వద్ద స్టాక్​ను ఇతరులకు చెందిన మరో ఏడు రైస్​మిల్స్​కు మళ్లించినట్లు డిసెంబర్‌‌లో ఓ లెటర్​ను సర్కారుకు పంపి డైవర్ట్​ చేశారు. ఆయన చెప్పిన ఏడు రైస్​మిల్స్​కు వెళ్లి విచారణ చేపట్టగా తమకు ఏ ధాన్యం రాలేదని వారు స్టేట్​మెంట్​ఇచ్చారు. దీంతో  షకీల్​పై కోటగిరి పోలీస్​స్టేషన్​లో కేసు నమోదు చేశారు. 

సహకరించిన ఫలితమే ఇది 

షకీల్​ ఆధ్వర్యంలో వడ్లు మాయమైన ఉదంతంపై ​రెండు నెలల కిందటే విచారణ పూర్తయింది. నిజానిజాలు తేలినా పార్లమెంట్​ ఎలక్షన్స్​​ కోడ్ ​వల్ల గవర్నమెంట్ ​చర్యలు తీసుకోవడంలో ఆలస్యమైంది. రూలింగ్ ​పార్టీ ఎమ్మెల్యే అంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు దాకా షకీల్ ​అవినీతికి అండగా ఉన్న ఇద్దరు ఆఫీసర్లు ఇప్పుడు బలి కావాల్సి వచ్చింది. గవర్నమెంట్ ​కొనుగోలు సెంటర్లకు షకీల్​మనుషులు వచ్చి వందల సంఖ్యలో వడ్ల లారీలను మళ్లించుకుపోయినా నోరు తెరవకపోవడం, స్టాక్ ​అంతా సరిగ్గానే ఉందని  రికార్డులు రాసిన ఫలితాన్ని డీఎస్​వో చంద్రప్రకాశ్​,  డీఎం జగదీశ్​సస్పెన్షన్​ రూపంలో అనుభవిస్తున్నారు. షకీల్​కు అండగా ఉండి.. గత డిసెంబర్​కు ముందు ట్రాన్స్​ఫర్​ అయి వెళ్లిపోయిన మరో ముఖ్య ఆఫీసర్​పాత్రపైనా ఇంటెలిజెన్స్​ రిపోర్టు రెడీ అవుతోంది.