రాఖీ పండగ ఎఫెక్ట్ .. టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత‌

రాఖీ పండగ ఎఫెక్ట్ .. టీ-9 టికెట్లు తాత్కాలికంగా నిలిపివేత‌

రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను తాత్కాలికగా నిలిపివేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ప్రకటించింది.  2023 ఆగస్టు 28 మంగళవారం నుంచి  నాలుగు రోజుల పాటు నిలుపుదల అమల్లో ఉంటుందని తెలిపింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీ నుంచి ఈ టికెట్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది.  

పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణికులకు టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ జారీ చేస్తోంది. 60 కిలోమీట‌ర్ల‌ పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60ని, 30 కిలో మీటర్ల ప‌రిధిలో టీ-9-30ని అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-9-60 టికెట్‌ను రూ.100కు, టి-9-30ని రూ.50కి ప్రయాణికులకు అందజేస్తోంది.  కాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా 3 వేల ప్రత్యేక ఆర్టీసీ బస్సులను టీఎస్ఆర్టీసీ నడుపుతోంది.  

రాఖీ పౌర్ణమికి బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో టీ-9 టికెట్లను మంజూరు చేయడం సిబ్బందికి కష్టం. టికెట్ల జారీకి ప్రయాణికుడి జెండర్, వయసు, తదితర వివరాలను టిమ్ మిషన్లలో నమోదు చేయాల్సి ఉంటుంది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు అందుకు చాలా సమయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టి-9 టికెట్లను తాత్కాలికంగా నిలుపుదల చేయాలని సంస్థ నిర్ణయించింది.