హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ‘విద్యార్థుల వార్షిక పోటీలు-–2025’ పేరుతో కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని, విద్యార్థులకు క్విజ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు మండల స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు నిర్వహించారని మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నవంబర్ 4– 13వరకు రాష్ట్ర స్థాయిలో టీ-సాట్ వేదికగా జరిగే వేడుకలతో ఈ పోటీలు ముగియనున్నాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పోటీల్లో సుమారు 22,000 మంది విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. “ఇందులో10 వేల మంది విద్యార్థులకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేశాం. టీ-సాట్ వేదికగా నవంబర్ 12, 13 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి ఫైనల్ పోటీల్లో 100 మంది విద్యార్థులు పాల్గొంటారు. ముగింపు ఉత్సవానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతుల ప్రదానం చేస్తారు” అని పేర్కొన్నారు.
