తహశీల్దార్ సజీవ దహనం.. కేసీఆర్ కామెంట్స్ వల్లే ఈ దాడి

తహశీల్దార్ సజీవ దహనం.. కేసీఆర్ కామెంట్స్ వల్లే ఈ దాడి
  • కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి

రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ త‌హ‌శీల్దార్ విజ‌య‌ారెడ్డి సజీవ దహనం అనాగరికమైన చర్య అని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రభుత్వం ఏ కార్యక్రమం జరిగినా విజయారెడ్డి ప్రతి గ్రామంలో తిరిగి మంచిగా పని చేసిన అధికారి అని చెప్పారాయన. తనకు ఆమె పనితీరు గురించి తెలుసని అన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి ఉందని సీఎం కేసీఆర్ పలుమార్లు చేసిన కామెంట్స్ వల్లే ఇలాంటి దాడి జరిగిందన్నారాయన.  98 శాతం కష్టపడి పనిచేసే అధికారులే ఉన్నారని, ఎక్కడో ఒకటి, రెండు శాతమే తప్పు చేస్తుంటారని అన్నారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి పదేపదే రెవెన్యూ శాఖపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు కోమటిరెడ్డి.

తహశీల్దార్ విజయారెడ్డి హత్య జరిగిన తర్వాత నిరసనగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డుపై బైఠాయించారు. వారికి సంఘీభావంగా అందులో పాల్గొన్నారు ఎంపీ కోమటి రెడ్డి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. తహశీల్దార్ విజయారెడ్డి చాలా నిబద్ధతతో పనిచేసేవారని.. అలాంటి ఉద్యోగిపై దాడి జరగడం బాధాకరమన్నారు.