- బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 చరిత్రలో నిలిచిపోయే రోజు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష దేశ రాజకీయాల్లో పెను భూకంపం సృష్టించిందని తెలిపారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను పదేండ్లలో కేసీఆర్ఎంతో అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.
అన్ని పండుగలను ఘనంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుపుకున్నామని, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించామని చెప్పారు. గురువారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ జీహెచ్ఎంసీ స్థాయీ జనరల్ బాడీ మీటింగ్లో ఆయన మాట్లాడారు.
ఈ నెల 29న తెలంగాణ భవన్లో దీక్షా దివస్ను ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు సంబంధించిన ప్రత్యేక వీడియోను ప్రదర్శిస్తామని, ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలంతా వస్తారని వెల్లడించారు.
