తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదాతలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం (సెప్టెంబర్ 23న) ప్రకటించారు.
అవయవ దానం విషయంలో తమిళనాడు దేశంలోనే అగ్రగామిగా ఉందన్నారు సీఎం స్టాలిన్. విషాదకర పరిస్థితుల్లో తమ ఆత్మీయుల అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబాల నిస్వార్థమైన త్యాగాల వల్లే ఈ ఘనత సాధ్యమైందని చెప్పారు.
- ALSO READ |రూ.2 వేల నోటుకు.. మరో వారమే గడువు
మరణానంతర అవయవదానం చేయటం వల్ల ఎంతో మంది ప్రాణాలు నిలబడ్డాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు. మిగిలిన వాళ్లు కూడా అవయవ దానం చేసేలా ప్రోత్సహించాలని కోరారు. అవయవ దాతలు, వారి కుటుంబ సభ్యుల త్యాగాన్ని గుర్తించి ఆర్గాన్ డోనర్స్ అంత్యక్రియలకు రాష్ట్రం తరఫున గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.