సనాతన ధర్మం గురించి తాను చేసిన వ్యాఖ్యలు సరైనవేనని తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి చెప్పారు. సనాతన ధర్మంపై నిర్వహించిన సమావేశంలో మంత్రులు పాల్గొనడం తప్పని, పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు ప్రశ్నించిన దానిపై బదులిస్తూ.. తాను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదన్నారు. అంబేడ్కర్, పెరియార్, తిరుమావళవన్లు సనాతనానికి వ్యతిరేకంగా మాట్లాడిన దానికంటే తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదన్నారు. ఏదైనా చట్టప్రకారం ఎదుర్కొంటానని చెప్పారు.
నీట్కు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల ఉద్యమంలో భాగంగా ఉదయనిధి డీఎంకే కూటమి పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగడుతున్నారు. సోమవారం (నవంబవర్ 6న) వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్ను అశోక్నగర్లోని వీసీకే కార్యాలయంలో కలిసి నీట్కు వ్యతిరేకంగా సంతకం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడారు. నీట్ విషయంలో అన్నాడీఎంకే అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఇంకోలా మాట్లాడకూడదన్నారు. ఇది ఏ ఒక్కరి సమస్య కాదన్నారు.