గేమ్ ఆడుతూ బూతు కామెంట్రీ.. భార్యాభర్తల అరెస్ట్

గేమ్ ఆడుతూ బూతు కామెంట్రీ.. భార్యాభర్తల అరెస్ట్

చెన్నై: గేమ్‌ ఆడుతూ బూతు కామెంట్రీతో లైవ్ స్ట్రీమింగ్ చేసినందుకు ఓ యూట్యూబర్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని చెన్నైకి చెందిన మదన్‌ కుమార్ అనే వ్యక్తి ప్రముఖ యూట్యూబర్‌. అతడి భార్య కార్తీక ఈ చానల్‌కు అడ్మిన్‌‌గా వ్యవహరిస్తోంది. వీరి చానల్‌‌కు 8 లక్షల సబ్‌స్క్రైబర్స్ ఉండటం గమనార్హం. అయితే రీసెంట్‌గా యూట్యూబ్‌లో  మదన్ పెట్టిన ఓ వీడియో వివాదాస్పదంగా మారింది. భారత్‌లో బ్యాన్ చేసిన పబ్‌జీ గేమ్ ఆడుతూ, బూతులతో మదన్ లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ఈ వీడియోలో మహిళలను అవమానిస్తూ, దూషిస్తూ అతడు చేసిన వ్యాఖ్యలపై వివాదం రేగుతోంది. 

మదన్‌ను అరెస్ట్ చేయాల్సిందిగా ఓ చెన్నై వాసి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు మదన్‌తోపాటు యూట్యూబ్ చానల్‌కు అడ్మిన్‌గా ఉన్న అతడి భార్యను పట్టుకున్నారు. బెయిల్ కోసం మదన్ పిటిషన్ వేయగా.. వాదనల సందర్భంగా అతడు మాట్లాడిన వీడియోలను చూసిన మద్రాస్ హైకోర్టు షాక్ అయ్యింది. కాగా, యూట్యూబ్ ద్వారా ప్రతి నెల రూ.3 లక్షల వరకు మదన్ సంపాదిస్తున్నాడని, అతడి వద్ద 3 లగ్జరీ కార్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మదన్ సబ్‌‌స్క్రైబర్లలో చాలా మంది మైనర్లు ఉన్నారని చెప్పారు. పబ్‌జీ లేదా ఇతర గేమింగ్ రూల్స్‌‌ను మదన్ ఉల్లంఘించాడో లేదో తెలుసుకునే పనిలో ఉన్నామని చెప్పారు.