ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఉదయం 7 నుంచి పోలింగ్ కొనసాగుతోంది. సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పెరియాకులంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం. ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరుసగా మూడోసారి ఏఐడీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

సొంత రాష్ట్రం తమిళనాడులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై. చెన్నైలోని విరుగంబాక్కం పోలింగ్ కేంద్రంలో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కరోనా నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు గవర్నర్. 

చెన్నై  తేనాంపేట్ లోని చెన్నై హై స్కూల్ లో కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు కమల్ హసన్. ఆయన కూతుర్లు శృతి హసన్, అక్షర హాసన్ కూడా ఓటు వేశారు. ఇక సూపర్ స్టార్ రజిని కాంత్ థౌజండ్ లైట్స్ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టెల్లా మేరిస్ లోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. ప్రతి ఒక్కరు ఓటు వేయాలని కోరారు రాజకీయ, సినీ ప్రముఖులు. అజిత్ తన సతీమణితో ఓటు హక్కు వినియోగించుకున్నారు. విజయ్, సూర్య, కార్తి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.

పుదుచ్చేరిలో పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు ఆ రాష్ట్ర మాజీ సీఎం నారాయణ స్వామి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి పుదుచ్చేరిలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.