
- సేవాలాల్ సేన త్రిసభ్య కమిటీ డిమాండ్
ముషీరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ గిరిజన తండా పంచాయతీలను రెవెన్యూ పంచాయతీలుగా గుర్తించి తండా డెవలప్ మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయాలని.. ప్రత్యేక నిధులు కేటాయించాలని సేవాలాల్ సేన త్రిసభ్య కమిటీ డిమాండ్ చేసింది. ఎస్టీల అభివృద్ది కోసం ప్రత్యేక ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలని కోరింది. సేవాలల్ సేన రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల సమావేశం బుధవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ప్లానింగ్ కమిటీ చైర్మన్ ధరావత్ ప్రేమ్ చంద్ నాయక్, త్రిసభ్య కమిటీ చైర్మన్ భూక్య చిన్నబాబు నాయక్, జాతీయ నాయకులు భూక్య సంజీవ్ నాయక్, మోతిలాల్ నాయక్ హాజరయ్యారు. సేవాలాల్ సేన జాతీయ కమిటీ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సర్కారు రూ.10 కోట్లు మంజూరు చేసి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.
సేవాలాల్ జయంతి రోజున సెలవు ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాలకు నామినేటెడ్ పదవుల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. సమావేశంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఇన్ చార్జి మాలోతు సైదా నాయక్, రఘురాం, రాథోడ్ హుస్సేన్, భాస్కర్ నాయక్, వెంకన్న నాయక్, కళ్యాణ్ నాయక్
పాల్గొన్నారు.