
- ఇచ్చోడ, బేలలో ఆరుగురిపై కేసులు
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన టాస్క్ ఫోర్స్ దాడుల్లో నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. బేల మండలం సిర్సన గ్రామానికి చెందిన ఎండీ ఖుర్షిద్ వద్ద ఐదు కిలోల లూస్ నకిలీ విత్తనాలు, 23 నకిలీ విత్తనాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి బావ మహారాష్ట్రకు చెందిన మహుమూద్ నకిలీ విత్తనాలు తీసుకొస్తున్నట్లు తేలడంతో అతడిపై కూడా కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు.
ఇచ్చోడ మండలంలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇస్తాంనగర్ కు చెందిన జాదవ్ గజానంద్, కోకస్ మన్నూర్ కు చెందిన కంది శివకుమార్, కొత్తపల్లి రవీందర్ ను అరెస్టు చేయగా ముక్రా బికి చెందిన ఆదవ్ రవికాంత్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.
రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత
కాగజ్ నగర్, వెలుగు: రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను బెజ్జూర్పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వివరాల ప్రకారం.. కొందరు నకిలీ పత్తి విత్తనాలు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు కృష్ణపల్లి, సుష్మిర్ గ్రామాల్లో తనిఖీ చేయగా రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయని చెప్పారు.
అమ్మేందుకు ప్రయత్నిస్తున్న కుకుడకు చెందిన ఎర్మ ప్రశాంత్, గెడం అనిల్, సుస్మీర్కు చెందిన తలండి సురేశ్, సిర్పూర్ టీ మండలం భూపాల పట్నానికి చెందిన బొల్లబోయిన అశోక్ మీద కేసు నమోదు చేసి, వారి వద్ద విత్తనాలు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నకిలీ విత్తనాల విలువ రూ.60 వేలు ఉంటుందని పేర్కొన్నారు.